బెంగళూరు: స్నేహితుడికి ఇచ్చిన రూ. 500 అప్పుతీర్చలేదని ఆయన భార్యనే పెళ్లాడాడో ప్రబుద్ధుడు. ఆమెను అపహరించి మరీ ఈ దారుణానికి ఒడిగట్టాడు.కర్ణాటకలోని బెళగావిలో ఈ ఘటన చోటు చేసుకుంది.
వివరాల్లోకెళితే.. రమేశ్ హెక్కేరి, బసవరాజ్ కొనన్నావార్, పార్వతి బెళగావిలోని ఓ హోటల్లో కొన్నేళ్లుగా సప్లయర్లుగా పనిచేస్తున్నారు. ఈ క్రమంలో బసవరాజ్కు పార్వతికి మధ్య పరిచయడం ఏర్పడి అది ప్రేమగా మారింది. 2011లో ఈ ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు వీళ్లిద్దరికీ మూడేళ్ల పాప కూడా ఉంది.ప్రస్తుతం ఆమె గర్భిణి కావడంతో కొద్ది రోజులక్రితం పుట్టింటికి వెళ్లింది.కొన్ని నెలల క్రితం రమేశ్ వద్ద బసవరాజ్ రూ.500 అప్పుతీసుకున్నారు. అప్పు తీర్చాలంటూ బసవరాజు మీద రమేశ్ ఒత్తిడి తీసుకురావడంతో ఇద్దరి మధ్య తగాదాలు ఏర్పడ్డాయి. దీంతో కొద్ది రోజుల క్రితం పార్వతిని రమేశ్ కిడ్నాప్ చేశాడు. అనంతరం ఆమెను పెళ్లి చేసుకున్నాడు.
స్నేహితుడి దుశ్చర్యను ఖండించిన బసవరాజు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసుల నుంచి ఎలాంటి స్పందనా రాకపోవడంతో బెళగావిలోని డిప్యూటీ కమిషనర్ కార్యాలయం ముందు ధర్నాకు దిగాడు. అనంతరం ఆత్మహత్యాయత్నం చేశాడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు పార్వతి ఆచూకీ కనిపెట్టారు. రమేశ్ను పోలీసులు అరెస్టు చేసి అపహరణ, బలవంతపు పెళ్లికి సంబంధించి కేసు నమోదు చేశారు.