యెంకీ చావు సుబ్బికి వచ్చింది అన్నది పాత సామెత, బ్రాండ్ అంబాసడర్ తప్పు చేస్తే బ్రాండ్ కి చావు అన్నది కొత్త సామెత లాగా ఉన్న ఇది నిజం. దేశంలో రోజు ఎవరో ఒకరు పెరుగుతున్న అసహనంపై మాట్లాడడం దాన్ని మీడియా వర్గాలు రచ్చ రచ్చ చేయడం చూస్తూనే ఉన్నాం. అసహనం అనే పదానికి ఎవరి అర్దం వారు తీసుకొని చేస్తున్న వ్యాఖ్యలే దీనికి కారణం. ఆ వ్యాఖ్యలను కూడా ఎవరికి అనుకూలంగా వారు మార్చుకొంటున్నారు. తాజాగా ఈ జాబితాలో హింది నటుడు అమీర్ ఖాన్ చేరారు. ఆయన అసహనంపై మాట్లాడుతూ, తన భార్య తమ పిల్లలను దృష్టిలో పెట్టుకొని భారతదేశాన్ని వదిలి పెడదాం అని సలహా ఇచ్చింది అని చెప్పారు. ఆ మాటలు మీడియా వాళ్ళు అతి ప్రచారం చేయడంతో ప్రతి ఒక్కరి చెవిలో పడ్డాయి. దీనిపై అసహనానికి మద్దతుగా నిలిచిన వారు అమీర్ ఖాన్ కి బాసటగా నిలిస్తే, ఆది నచ్చని వారు బహిరంగంగా ఖండించారు. హింది నటుడు అనుపమ్ ఖేర్ ఐతే ఏకంగా ట్విట్టర్లో అమీర్ ఖాన్ పై దుమ్మెత్తి పోశాడు. రామ్గోపాల్ వర్మ కూడా తనదైన శైలిలో సటైర్ లు వేశాడు.
అసలు ఆయన మాట్లాడిన సంధర్భాన్ని తెలుసుకోకుండా సామాన్య ప్రజలు సైతం అసహనం ఉన్న దేశంలో అమీర్ ఖాన్ అంత పెద్ద నటుడు ఎలా అయ్యాడు అంటూ సోషియల్ మీడియా లో ప్రశ్నలు అడుగుతున్నారు. ఇంకొంత మంది ఒక అడుగు ముందుకేసి అమీర్ఖాన్ బ్రాండ్ అంబాసడర్ గా ఉన్న ప్రాడక్ట్స్ ని వాడవద్దని ప్రచారం చేస్తున్నారు. ఆ ప్రభావం ఆల్రెడీ ఆయన బ్రాండ్ అంబాసడర్ గా ఉన్న స్నాప్ డీల్ పై పడింది. చాలామంది స్నాప్ డీల్ యాప్ పై గూగుల్ స్టోర్ లో తక్కువ రేటింగ్తో రివ్యూ లు రాస్తున్నారు. చాలా మంది కామెంట్లలో ఇదే విషయం రాస్తున్నారు, అమీర్ ఖాన్ ని బ్రాండ్ అంబాసడర్ పదవి నుండి పీకీ వేసే దాకా ఆ యాప్ నుండి ఎటువంటి ప్రాడక్ట్స్ ని కొనుగోలు చేయము అని. సో అసహనంపై ఆమీర్ ఖాన్ చేసిన వ్యాఖ్యలు ఎటో తిరిగి స్నాప్ డీల్ మీద పడ్డాయి అని ఆ కంపనీ వారు అసహనానికి గురవ్వుతున్నారు.