భారతదేశ క్రికెట్ జట్టు ప్రధాన కోచ్ పదవికి భారతదేశ క్రికెట్ టీమ్ మాజీ కెప్టెన్ అనిల్ కుంబ్లే ఎంపికయ్యారు. కొన్నాళ్లుగా ఖాళీగా ఉన్న ఈ పోస్ట్ కోసం 57 మంది పోటీ పడగా, ఆటగాడిగా భారత క్రికెట్ కు ఎనలేని సేవలు అందించిన అనిల్ కుంబ్లే ని ఆ స్థానం వరించింది. సచిన్, గంగూలీ, లక్ష్మణ్ లతో కూడిన బిసిసిఐ సలహా మండలి పలువురిని ఇంటర్వ్యూ చేసి చివరికి కుంబ్లే ని ప్రధానకోచ్ గా నిర్ణయించింది. దీనిపై క్రికెట్ వర్గాల్లో సర్వత్రా హర్షం వ్యక్తమైంది. భారతదేశ క్రికెట్ గురించి మంచి అవగాహన ఉన్న కుంబ్లే, కోచ్ కావడం టీమ్ కి బాగా ఉపయోగపడుతుంది అని పలువురు ప్రముఖులు తెలిపారు.
ప్రధానకోచ్ గా ఎంపికైన తర్వాత కుంబ్లే నిన్న మీడియాతో మాట్లాడారు. ముందుగా బిసిసిఐ కి మరియు తనపై నమ్మకముంచిన సలహా కమిటీకి కృతజ్ఞతలు తెలిపారు. ఇది తనకు చాలా పెద్ద భాద్యత అని దానికి తగ్గట్టుగానే కష్టపడి పని చేస్తానని తెలిపారు. కోచ్ కన్నా ముందు నేను కూడా ఒక ఆటగాడినే అని గుర్తుకు చేసుకుని వచ్చే సవాళ్ళని స్వీకరిస్తా అని తెలిపారు. జూనియర్స్ టీమ్ కి శిక్షణనిస్తున్న రాహుల్ ద్రావిడ్ మరియు సలహా సంఘ సభ్యులతో తనకు మంచి సంబందాలు ఉన్నాయని వారందరితో కలిసి పని చేసి భారతదేశ క్రికెట్ కి మంచి పేరు తెస్తా అని తెలిపారు.
“జంబో” ఒకప్పుడు ఆటగాడిగా బంతిని గిర గిర తిప్పి జిమ్ లెకర్ తర్వాత ఒక ఇన్నింగ్స్లో 10 విక్కెట్స్ తీసి చరిత్ర సృష్టించాడు. ఇప్పుడు ప్రధాన కోచ్ పదవిలో భారత దేశ క్రికెట్ ని ఇంకా ముందుకు తీసుకుపోవాలని కోరుకుందాం.