ఈ సంవత్సరం భారత పర్యటనకు వచ్చే ఆస్ట్రేలియా జట్టు క్రీడాకారుల జాబితా ఆ దేశ క్రికెట్ బోర్డు శుక్రవారం ప్రకటించింది. సెప్టెంబరు-అక్టోబరులో ఆస్ట్రేలియా జట్టు భారత్లో పర్యటించనుంది. ఈ పర్యటనలో ఆతిథ్య భారత్తో కంగారూల జట్టు 5 వన్డేలు, 3 టీ20లు ఆడనుంది. వన్డేల కోసం ఒక జట్టును, టీ20ల కోసం మరో జట్టును ఎంచుకున్న ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు జట్టు సభ్యుల పేర్లను వెల్లడించింది.
గాయంతో బాధపడుతున్న స్టార్ బౌలర్ మిచెల్ స్టార్క్కు భారత పర్యటనలో చోటు దక్కలేదు. గాయం నుంచి కోలుకున్నప్పటికీ భారత్ టూర్ తరువాత ఇంగ్లాండ్ జట్టుతో నవంబరులో జరగబోయే యాషెస్ సిరీస్ని దృష్టిలో ఉంచుకుని స్టార్క్కు విశ్రాంతి కల్పించినట్లు బోర్డు అధికారులు తెలిపారు. పేస్ బౌలర్లు జేమ్స్ ఫాల్కనర్, నాథన్ కౌల్టర్ నైల్, ఆల్రౌండర్లు ఆస్టన్ అగర్, హిల్టన్ కార్ట్రైట్ వన్డే జట్టులో స్థానం దక్కించుకున్నారు.
వన్డే జట్టు: స్టీవ్ స్మిత్(కెప్టెన్), డేవిడ్ వార్నర్(వైస్ కెప్టెన్), ఆస్టన్ అగర్, హిల్టన్ కార్డ్రైట్, నాధన్ కౌల్టర్ నైల్, కమిన్స్, జేమ్స్ ఫాల్కనర్, అరోన్ ఫించ్, హేజిల్వుడ్, ట్రావిస్ హెడ్, మ్యాక్స్వెల్, మార్కస్ స్టోయినిస్, మాథ్యూ వేడ్, అడమ్ జంపా.
టీ20 జట్టు: స్టీవ్ స్మిత్(కెప్టెన్), డేవిడ్ వార్నర్(వైస్ కెప్టెన్), జాసన్ బెహ్రెన్డోర్ఫ్, డాన్ క్రిస్టియన్, నాధన్ కౌల్టర్ నైల్, కమిన్స్, అరోన్ ఫించ్, ట్రావిస్ హెడ్, మొయిస్ హెన్రిక్స్, మ్యాక్స్వెల్, టిమ్ పైని, కేన్ రిచర్డ్సన్, అడమ్ జంపా.
ప్రస్తుతం భారత క్రికెట్ జట్టు శ్రీలంక పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే శ్రీలంకతో టెస్ట్ సిరీస్ ని క్లీన్ స్వీప్ చేసిన కోహ్లీ సేన ఐదు వన్డేల సిరీస్లో భాగంగా ఆగస్టు 20 న భారత్-శ్రీలంక మధ్య తొలి వన్డే జరగనుంది. ప్రస్తుతం బంగ్లాదేశ్ పర్యటనలో ఉన్న ఆసీస్ జట్టు ఆ పర్యటన తరువాత నేరుగా భారత్ కి రానుంది.