తెలంగాణ రాష్ట్రంలో జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ చేస్తున్న ప్రజా యాత్ర జోరుగా సాగుతుంది. పవన్ కళ్యాణ్ యాత్రపై కాంగ్రెస్, బీజేపీ నాయకులూ ఇప్పటికే విమర్శల దాడి మొదలుపెట్టింది. అప్పుడు వ్యతిరేకించి.. తెలంగాణ ఇచ్చినందుకు 11 రోజులు అన్నం మానేసిన వ్యక్తికి.. ఇప్పుడు రాష్ట్రంలో ఏం పని అని ప్రశ్నిస్తున్నారు. ఇవన్నీ ఎలా ఉన్నా.. పవన్ కల్యాణ్ పర్యటన జోరుగానే సాగుతూ ఉంది తెలంగాణలో. ప్రజా సమస్యలని అధ్యయనం చేయడం కోసం జనసేన ప్రజా యాత్ర చేస్తున్న పవన్ కళ్యాణ్ మూడో రోజు ఖమ్మం జిల్లాలో పర్యటించారు. ఖమ్మం జిల్లా కొత్తగూడెం నుండి ఖమ్మంకి చేరుకొని కారుపై ఉండి ప్రజలకి అభివాదం చేస్తూ రోడ్ షో చేశారు. ఖమ్మం తల్లాడ సెంటర్ దగ్గరకు వచ్చే సరికి.. ఓ గుర్తు తెలియని వ్యక్తి పవన్ పైకి చెప్పు విసిరేశాడు. అది సరిగ్గా వాహనం బానెట్ పై పడింది. షాక్ అయ్యారు అభిమానులు. పవన్ కు చెప్పు తగలకపోవటంతో ఊపిరిపీల్చుకున్నారు. పోలీసులు కూడా అలర్ట్ అయ్యారు.
చెప్పు పడిన విషయం తెలిసిన వెంటనే పోలీసుల చుట్టుపక్కల గాలించారు. పవన్ చుట్టూ రక్షణ వలయంగా నిలబడ్డారు. చెప్పు విసిరిన వ్యక్తిని గుర్తించేందుకు ప్రయత్నించారు. ఈ ఘటనకి సంభందించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.