ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే పరీక్షల ప్రక్షాలనకు నడుం బిగించింది అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ). వచ్చే ఏడాది నుండి మెడిసిన్ కోర్సులో ప్రవేశానికి దేశవ్యాప్తంగా కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ ఎలాగైతే ప్రారంభించారో అదే విధంగా ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశానికి కూడా దేశవ్యాప్తంగా కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ను ప్రవేశపెట్టాలని నిర్ణయం తీసుకుంది. ఢిల్లీలో జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో పై విధంగా తీర్మానం చేసిన ఏఐసీటీఈ వర్గాలు ఈ విధానాన్ని వచ్చే విద్యా సంవత్సరం నుండి మొదలు పెట్టాలని నిర్ణయించారు.
అయితే ఇన్నిరోజులు ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశానికి మన తెలుగు రాష్ట్రాలు ఎంసెట్ ఎగ్జామ్ నిర్వహిస్తున్నట్లే వివిధ రాష్ట్రాలు వేరు వేరు పరీక్షల ఆధారంగా ప్రవేశాలు నిర్వహిస్తున్నాయి. కాని జాతీయ విద్యా సంస్థలైన ఎన్ఐటీ, ట్రిపుల్ ఐటీతో పాటు కేంద్ర సహకారంతో నడిచే విద్యాసంస్థలు జేఈఈ మెయిన్ ర్యాంకు ఆధారంగా ప్రవేశాలు చేపడుతున్నాయి. ఇన్ని పరీక్షలకు బదులు దేశవ్యాప్తంగా ఒకటే కామన్ ఎంట్రెన్స్ టెస్ట్తో అన్ని కాలేజీలకు ప్రవేశాలు చేపట్టాలని ఏఐసీటీఈ ప్రణాళిక సిద్ధం చేస్తోంది. కేంద్రం నుంచి ఈ నిర్ణయానికి ఆమోదం లభిస్తే 2018-19 విద్యాసంవత్సరం నుండి ఇక ఇంజనీరింగ్ కాలేజీలలో ప్రవేశానికి దేశవ్యాప్తంగా ఒకటే కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ ఉండబోతుంది.