తెలుగు సినీ ఇండస్ట్రీ పెద్ద దిక్కు, దర్శకరత్న దాసరి నారాయణ రావు(75) ఈరోజు మంగళవారం (మే 30) సాయంత్రం ఏడు గంటల సమయంలో హైదరాబాద్ లో కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన చికిత్స నిమిత్తం కిమ్స్ ఆసుపత్రిలో జాయిన్ అయ్యారు. గత ఐదు నెలల్లో ఐదుసార్లు ఆపరేషన్ జరిగినా ఆయన ఆరోగ్యం కుదుటపడలేదు. శస్త్రచికిత్స అనంతరం మళ్లీ ఇన్ఫెక్ష్న్ సోకడంతో దాసరి నాలుగురోజుల క్రితం మరోసారి తీవ్ర అస్వస్థతకు గురవడంతో కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. చివరికి ఈరోజు సాయంత్రం ఆయన తుది శ్వాస విడిచారు.
దాసరి నారాయణరావు గారు 1942, మే 4న పశ్చిమ గోదావరి జిల్లా, పాలకొల్లులో మహాలక్ష్మి, సాయిరాజ్ దంపతులకు జన్మించారు. 150 చిత్రాలకు పైగా దర్శకత్వం వహించి తెలుగు కళామతల్లి ముద్దుబిడ్డగా ఎన్నో కీర్తి ప్రతిష్ఠలు అందుకున్నారు.అత్యధిక చిత్రాల దర్శకుడిగా గిన్నిస్ రికార్డుల్లోకెక్కారు. నిర్మాతగా, దర్శకుడిగా, మాటల రచయితగా, గీతరచయితగా కూడా ఆయన పని చేశారు. ఎన్టీఆర్, ఏఎన్నార్, వంటి అగ్రనటులతో సినిమాలు తీసిన దాసరి జాతీయస్థాయి పురస్కారాలు అందుకున్నారు. ఆయనకు ఓ కుమార్తె, ఇద్దరు కుమారులు ప్రభు, అరుణ్కుమార్ ఉన్నారు. తెలుగు చిత్ర పరిశ్రమకు విశిష్ట సేవలు అందించిన దాసరి గారి ఆత్మకు శాంతి కలుగాలని ప్రార్దిద్ధాం.