మే 05, 2017 న ఆంధ్రప్రదేశ్లోని శ్రీహరికోటలో ఉన్న సతీశ్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి జీఎస్ఎల్వీ-ఎఫ్09 వాహకనౌక ద్వారా జీశాట్-9 ఉపగ్రహాన్ని నింగిలోకి పంపేందుకు భారత రోదసి పరిశోధన సంస్థ (ఇస్రో) రెడీ అయ్యింది. అంతరిక్షరంగంలో దూసుకుపోతున్న మనదేశం దక్షిణాసియా దేశాల అభివృద్ధి కొరకు సొంత ఖర్చుతో జీశాట్-9 ఉపగ్రహాన్ని అభివృద్ధి చేసి నేడు అంతరిక్షంలోకి పంపనుంది. దీని ద్వారా సార్క్ దేశాలకు తన సహకారాన్ని అందించి భారత్ పెద్దన్న పాత్ర పోషించనుంది. ఈ ఉపగ్రహ ప్రయోగాన్ని అడ్డుకోవడానికి దాయాది దేశం పాకిస్తాన్ ఎన్ని కుట్రలు చేసినా వాటినన్నింటిని పటాపంచలు చేసి చివరకు భారత్ ఈరోజు జీశాట్-9 ఉపగ్రహాన్ని నింగిలోకి పంపనుంది. ఆ ఉపగ్రహం గురించి మీకు తెలియని విషయాలు క్రింద చదివి తెలుసుకోండి.
జీఎస్ఎల్వీ-ఎఫ్09 వాహకనౌక మోసుకెళ్తున్న జీశాట్-9 ఉపగ్రహం బరువు 2230 కిలోలు మరియు ఈ ఉపగ్రహం 12 సంవత్సరాలు అంతరిక్షం నుండి తన సేవలను మనకు అందించనుంది.
ఈ ప్రాజెక్ట్ మొత్తం వ్యయం రూ.450 కోట్లు కాగా ఉపగ్రహ తయారీకి రూ.235 కోట్లు ఖర్చయ్యింది.
ఈ జియోస్టేషన్ కమ్యూనికేషన్ ఉపగ్రహం వలన దక్షిణ ఆసియా దేశాలు Ku-బ్యాండ్ లో వివిధ రకాల కమ్యూనికేషన్ వ్యవస్థలు ఎర్పరుచుకోవచ్చు.
మెరుగయ్యే కమ్యూనికేషన్ వ్యవస్థల వలన దక్షిణాసియా దేశాలలో ప్రసారాలు, విపత్తు నిర్వహణ, వాతావరణ హెచ్చరికలు పంపడం సులువవుతుంది.
ఈ ఉపగ్రహం వలన సార్క్ దేశాలయిన భారత్, అఫ్గానిస్థాన్, భూటాన్, బంగ్లాదేశ్, నేపాల్, శ్రీలంక, మాల్దీవులు లబ్ధి పొందనున్నాయి కాని ప్రయోగానికి అయ్యే ఖర్చులన్నింటినీ మనదేశమే భరిస్తుంది.
అతి తక్కువ ఖర్చుతో 179 విదేశీ ఉపగ్రహాలను ప్రయోగించి, అంతరిక్ష వాణిజ్యంలో దూసుకెళుతున్న భారత రోదసి పరిశోధన సంస్థ (ఇస్రో) కి ఈ సందర్భంగా అభినందనలు.