తోటి పిల్లలతో హాయిగా బడికెళ్ళి చదువుకోవాల్సిన వయసులో అనారోగ్యం బారిన పడి ఆసుపత్రుల చుట్టూ తిరుగుతున్నాడు, చాక్లెట్లు చప్పరించాల్సిన నోట్లో చేదు మందు బిల్లలు వేసుకుంటున్నాడు, నాలుగు లక్షల మందిలో ఒకరికి వచ్చే అరుదైన ఫ్యాన్సోని ఎనిమియా అనే భయంకరమైన వ్యాధితో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న తన కొడుకుకి తన తన రక్తమాంసాలతో పునర్జన్మ ప్రసాదించాడు ఒక తండ్రి..!
పూర్తి వివరాల్లోకెళితే.. ఆంధ్ర ప్రదేశ్ పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఎస్వీకే విశ్వనాథరాజు సంగారెడ్డిలో ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగి. రెండేళ్ల కిత్రం తన కుమారుడు హనీశ్ వర్మ(4) శరీరంపై ఎర్రటి మచ్చలొస్తే.. చికెన్ ఫాక్స్ అన్న అనుమానంతో ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్స అందించినా తగ్గలేదు సరికదా ఎక్కువైంది. మరో ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడా తగ్గలేదు. హైదరాబాద్లో ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. అప్పటికే చిన్నారి శరీరంలో రక్తం స్థాయి పడిపోయింది. మళ్లీ మళ్లీ పరీక్షలు చేసిన వైద్యులు.. హనీశ్కు అప్లాస్టిక్ ఎనీమియా వచ్చినట్లు తేలింది. జన్యుపరంగా వచ్చే అరుదైన ‘ఫ్యాన్కోనీ ఎనీమియా’ కూడా ఉన్నట్లు వెల్లడైంది. ఫ్యాన్కోని ఎనీమియా అంటే ఎముకలో ఉండే మూలుగులోని రక్తకణాలు చనిపోవడం. చికిత్స చేయడం కష్టమన్నారు వైద్యులు.
హనీశ్కు మరణం తప్పదని భావించారు. ఈ క్లిష్టమైన కేసును నగరంలోని ఓ కార్పొరేట్ ఆస్పత్రి సవాల్గా తీసుకుంది. మూలకణాలతో చికిత్స చేస్తే వ్యాధి నయం అవుతుందని తేల్చారు. డేటా బ్యాంకులో ఎవ్వరి మూలకణాలతోనూ హనీశ్కు మ్యాచ్ కాలేదు. తండ్రి విశ్వనాథ్ మూల రక్తకణాలతో ప్రయత్నం చేయగా అవికూడా సగమే సరిపోయాయి. వాస్తవానికి 100శాతం రక్తకణాలు ఉంటేనే శస్త్రచికిత్స విజయవంతం అవుతుంది. చివరి ప్రయత్నంగా సగం సరిపోయిన మూలరక్తకణాలతోనే చిన్నారికి మార్పిడి చేశారు. ఇందులో కూడా కొన్ని సంక్ష్లిష్టమైన సమస్యలు ఎదురయ్యాయి. తండ్రి బ్లడ్ గ్రూప్ O పాజిటివ్ కాగా హనీష్ ది A పాజిటివ్.
నాలుగు గంటల్లోనే ఆపరేషన్..
ఆపరేషన్ ప్రక్రియ 4గంటల్లో పూర్తయింది. రక్తమూలకణాలు తండ్రి నుంచి వేరు చేసి సంరక్షించడానికి మూడున్నర గంటలు, వాటిని హనీశ్కు ఎక్కించడానికి అరగంట సమయం పట్టింది. హాల్పో ట్రాన్స్ప్లాంట్ (సగం మ్యాచ్ అయిన మూలకణాలు) విజయవంతమయింది. హనీశ్ పూర్తిగా కోలుకోవాలంటే 11రోజులు పడుతుంది. ప్రస్తుతం ఆ చిన్నారి మెల్లిగా కోలుకున్నాడు. మరికొన్ని రోజుల్లో పూర్తిగా కోలుకుంటాడని వైద్యులు చెబుతున్నారు.
కీమోథెరపీతో నరకం…
ముందుగా.. హనీశ్లో ఉన్న చెడు మూలకణాన్ని చంపాలి. అందుకోసం ఆ చిన్నారికి 9రోజుల పాటు 400 రెట్లు కీమోథెరపీనిచ్చారు. నాలుగేళ్ల ఆ చిన్నారికి ఆ స్థాయిలో కీమోథెరపీనివ్వడంతో తట్టుకోలేకపోయాడు. ఓ రెండురోజులు రోజుకు 60-70సార్లు విరోచనాలు అయ్యాయి. రక్తపు వాంతులలో పేగులు కూడా బయటకు వచ్చాయి. శరీరమంతా క్షీణించింది. ఆ చెడు మూలకణాలు పూర్తిగా చనిపోయాయని నిర్ధారించాక.. తండ్రి మూల రక్తకణాలతో ఆపరే షన్ చేశారు.
దేశంలోతొలిసారి…
మూలకణ ఆపరేషన్లు మన దేశంలో ఇప్పటి వరకు మూడు మాత్రమే జరిగాయి. పదేళ్లు దాటిన వయసు పిల్లలకు 2005లో తమిళనాడులో, 2015లో గుర్గావ్లో చేశారు. మన దగ్గర పిడియాట్రిక్ సెక్షన్లో అదీ సగం మ్యాచ్ అయిన మూలరక్తకణాలతో ఆపరేషన్ చేయడం ఇదే ప్రథమం అంటున్నారు కాంటినెంటల్ ఆస్పత్రి వైద్యులు.
Source: V6News.tv