రోజురోజుకి మోసాలు పెరిగిపోతున్నాయి,మనం ఉహించని విధంగా మోసం చేస్తున్నారు కేటుగాళ్ళు, ఈ మధ్య ఆన్ లైన్ షాపింగ్ తో పాటు ఆన్ లైన్ షాపింగ్ మోసాలు కూడా ఎక్కువ అయ్యాయి, ఆన్ లైన్ షాపింగ్ అంటే మనకు గుర్తొచ్చే ఫ్లిప్ కార్ట్ మీద ముంబైలో కేసు నమోదైంది. శామ్సంగ్ గెలాక్సీ నోట్ 4 ఫోన్ ఆర్డర్ చేస్తే, దానికి బదులు నిర్మా సబ్బు డెలివరీ చేసినందుకు మలబార్ హిల్ పోలీసు స్టేషన్లో ఈ కేసు నమోదైంది. వాల్కేశ్వర్ ప్రాంతానికి చెందిన ఆనంద్ భాలకియా ఫోన్ ఆర్డర్ చేస్తే, డెలివరీ వచ్చింది. కానీ అట్టపెట్టె ఓపెన్ చేసి చూస్తే అందులో ఫోనుకు బదులు నిర్మా సబ్బు కనిపించింది. ప్రముఖ ఐటీ కంపెనీలో పనిచేస్తున్న భాలకియా.. వెంటనే విషయాన్ని ఫ్లిప్కార్ట్కు తెలిపాడు. కానీ, అది తప్పుడు ఫిర్యాదు అని ఆ సంస్థ కొట్టిపారేయడంతో పోలీసులను ఆశ్రయించాడు. క్యాష్ ఆన్ డెలివరీ పద్ధతిలో తాను మే 25న శామ్సంగ్ గెలాక్సీ నోట్ 4 ఆర్డర్ చేశానని, అది మే 30న వచ్చిందని, దాంతో రూ. 29,900 చెల్లించి ప్యాక్ తీసుకున్నానని ఆయన చెప్పాడు.
తీరా బాక్స్ ఓపెన్ చేసి చూస్తే అందులో నిర్మా సబ్బు, ఆండ్రాయిడ్ ఫోన్ చార్జర్ ఉన్నాయని అన్నారు. తాను వెంటనే డెలివరీ బోయ్కి ఫోన్ చేసి పిలవగా, అతడు వచ్చి, ఫ్లిప్కార్ట్ కస్టమర్ కేర్కు ఫోన్ చేసి ఫిర్యాదుచేయాలని చెప్పాడన్నారు. కానీ కస్టమర్ కేర్ వాళ్లు దాన్ని తప్పుడు ఫిర్యాదుగా కొట్టేయడంతో మలబార్ హిల్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశానన్నారు. తనుకు ఫోన్ ఇవ్వాలి లేదా తన డబ్బు వాపస్ ఇవ్వాలని చాలాసార్లు వాళ్లకు ఫోన్ చేశానని, వాళ్లు ఏమాత్రం వినిపించుకోకపోవడంతో ఇక ఫిర్యాదు చేయక తప్పలేదని తెలిపారు.
ఇప్పటికే ఇలా వస్తువులకి బదులు సబ్బులు, ఇటుకలు, మామిడి పండ్లు ఇవ్వడం చాలా చోట్ల జరిగింది, అందుకే ఈ సారి మీరి ఏదైనా వస్తువు ఆన్ లైన్ ఆర్డర్ చేసినప్పుడు దానిని డెలివరీ బాయ్ ముందే తెరవడం చాలా మంచిది.