గుండెకి సంభందించిన వ్యాధులతో బాధపడుతున్న వారికి ప్రభుత్వం ఊరటనిచ్చే నిర్ణయం తీసుకుంది. హృద్రోగుల రక్త నాళాలలో వేసే కరోనరీ స్టెంట్ ధరలను 85% వరకు తగ్గించింది. ఇంతకుముందు రూ 1.21 లక్షలుగా ఉన్న డ్రగ్ ఎల్ల్యూటింగ్ స్టెంట్ (DES) మరియు బయో రీసార్బబుల్ స్టెంట్లు ఇకముందు 30,000 రూపాయలకే లభించనున్నాయి, అంతే కాకుండా ఇంతకుముందు 45,000 రూపాయలు ఉండే బేర్ మెటల్ స్టెంట్(BMS) ధరను 7,500 రూపాయలకు మార్చినట్లు నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ అథారిటీ(NPPA) ప్రకటించింది. ఈ నిర్ణయం వెంటనే అమలులోకి వస్తుందని మరియు అందరూ అమ్మకందారులు ఇప్పటికే తయారుచేసి మార్కెట్ లో ఉన్న పాత స్టెంట్లను కూడా ఈ తగ్గించిన ధరతోనే అమ్మాలని ప్రకటించింది.
ఈ నిర్ణయంతో కోట్ల సంఖ్యలో ఉన్న కార్డియాక్ రోగులకు మంచి కలుగనుంది. హార్ట్ ఆపరేషన్లకు ఆసుపత్రులు లక్షలకు లక్షలు వసూలుచేస్తుండడంతో చాలామంది పేదవారు హార్ట్ ఆపరేషన్లు చేయించుకోలేక చనిపోతున్నారు, అలాంటివారికి ఈ నిర్ణయం ఊరట కలిగించనుంది. ఇది కాక ఇంతకుముందు స్టెంట్ల ధరలపై నియంత్రణ లేకపోవడంతో ఆసుపత్రుల వారు తమకు ఇష్టం వచ్చినట్లుగా రోగులను దోచుకున్నారు. ఇప్పుడు ప్రభుత్వం నిర్ణయించిన ధరలతో ఆ దోపిడి కొంచెం తగ్గనుంది.