ఎముకలు కొరికే చలి.. కాళ్లు కూరుకుపోయే మంచు.. ఇవేమీ వారిని ఆపలేకపోయాయి. దేశంపై వాళ్లకు ఉన్న ప్రేమ ముందు అవన్నీ తలవంచాయి. మైనస్ 30 డిగ్రీల ఉష్ణోగ్రతను సైతం లెక్కచేయకుండా ఐటీబీపీ(ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్) జవాన్లు దట్టమైన మంచు కొండల్లో దేశ జాతీయ పతాకాన్ని రెపరెపలాడేలా చేశారు. అత్యంత ప్రతికూల పరిస్థితులను కూడా లెక్కచేయకుండ ఐటీబీపీ జవాన్లు మంచులో 18 వేల అడుగుల ఎత్తుకు నడుచుకుంటూ వెళ్లారు. 69వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఐటీబీపీ జవాన్లు దాదాపు 18వేల అడుగుల ఎత్తులో జాతీయపతాకాన్ని ఎగరవేసి యావత్ దేశ ప్రజలు గర్వపడేలా చేశారు. వారి అద్భుతమైన సాహసానికి సంబంధించిన వీడియోను ఐటీబీపీ తన అధికారిక సోషల్ మీడియాలో పోస్టు చేసింది.
ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ప్రాణాలను సైతం లెక్కచేయకుండా దేశంపై తమకు ఉన్న ప్రేమను చాటి చెబుతూ జవాన్లు చేసిన సాహసానికి నెటిజన్లు సలాం కొడుతున్నారు. ‘మిమ్మల్ని చూస్తేంటే గర్వంగా ఉంది’ ‘సెల్యూట్’ ‘జైహింద్’ ‘నిజమైన హీరోలంటే మీరే, హాట్స్ ఆఫ్ అంటూ నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.