ధర్మశాలలో ఆస్ట్రేలియా తో జరిగిన నాలుగవ టెస్ట్ మ్యాచులో భారత్ ఘనవిజయం సాధించింది దీనితో నాలుగు మ్యాచుల బోర్డర్-గావస్కర్ టెస్ట్ సిరీస్ను 2-1తో కైవసం చేసుకుంది. మొదటి ఇన్నింగ్స్ లో కొత్త కుర్రాడు కుల్దీప్ యాదవ్ నాలుగు వికెట్లు తీసి కంగారుల నడ్డి విరిస్తే, కీలకమైన్ రెండవ ఇన్నింగ్స్ లో అశ్విన్, జడేజా, యాదవ్ చెరో మూడు వికెట్లతో ఆసీస్ ఆటగాళ్ళ ఆటకట్టించి భారత్ కి స్వల్ప లక్ష్యం ఉండేలా చేసారు. రెండొ ఇన్నింగ్స్ లో రాహుల్ 51 పరుగులు చేసి భారత్ కి సునాయాస విజయాన్ని అందించాడు. ఈ సీరీస్ విజయంతో భారత్ టెస్ట్ మ్యాచు ఆడే అన్ని జట్లపై విజయం సాధించిన జట్టుగా రికార్డుల్లోకి ఎక్కింది.
మొదటి మ్యాచు విజయంతో అందరి దృష్టిని ఆకర్శించిన ఆసీస్ జట్టు తమ విజయ పరంపర కొనసాగించలేకపోయింది. రెండవ టెస్ట్ మ్యాచులో భారత్ విజయం సాధించడంతో సీరీస్ సమం అయ్యింది. ఇక మూడవ మ్యాచులో భారత్ విజయానికి చేరువగా వచ్చి చివర్లో చతికిలబడటంతో ఆ మ్యాచు డ్రా గా ముగిసింది. నిర్ణయాత్మకమైన ఈ నాలుగవ టెస్ట్ మ్యాచులో ఆదినుండి మంచి ప్రదర్శన కనబర్చిన టీం ఇండియా బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో అద్భుత ప్రదర్శనతో కంగారూలను ఓడించి మ్యాచుతో పాటూ సీరీస్ ని కూడా సొంతం చేసుకుంది.