జీపీఎస్ ప్రపంచ మార్గదర్శిగా పేరుగాంచిన ఆధునిక అవిష్కారం. ఎక్కడికి వెళ్ళాలనుకున్నా దారి తెలియదు అన్న భాద లేదు,ఎలా వెళ్ళాలి అన్న టెన్షన్ అస్సలు లేదు. మ్యాపింగ్ ద్వారా మీరు చేరాల్సిన గమ్యాన్ని అదే చూపిస్తుంది. ఏ మలుపు ఎక్కడ తిరగాలో కూడా చెప్తుంది. అమెరికాకు చెందిన ఈ గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్లో ఉపగ్రహాలు మొత్తం భూమిని కవర్ చేస్తూ శాటిలైట్ ద్వారా అందించే సమాచారాన్ని మనకు అందుబాటులోకి తెస్తాయి. మన ఊరిలో మనకు ఒక వీధికి ఎలా వెళ్ళాలో అమెరికా వారి ఉపగ్రహం చెబుతుందన్న మాట. ఐతే ఇప్పుడు ఏ భారతీయుడికీ అమెరికా సాయం అవసరం లేదు తనదేశ సొంత సిస్టంతోనే జీపీఎస్ స్థాయి సేవలని పొందబోతున్నాడు.
ఐఆర్ఎన్ఎస్ఎస్ సిరీస్ ను ఉపయోగించి. జీపీఎస్ను భర్తీ చేసేలా ఈ కొత్త విధానం ఇంకొన్ని రోజులలో అందుబాటులోకి వచ్చేలా పనులు నిర్వహిస్తున్నారు, పూర్తిగా భారత ప్రభుత్వం నియంత్రణలో పనిచేసే ఈ కొత్త ప్రాంతీయ నావిగేషన్ శాటిలైట్ సిస్టం ( Regional Navigation Satellite System-IRNSS) దేశంలోని యూజర్లకు సరైన సమాచారాన్ని, స్థానాన్ని అందించేందుకు ఇస్రో అభివృద్ధి చేస్తోంది. అయితే ఈ నూతన వ్యవస్థ అందుబాటులోకి వస్తే… సిగ్నల్స్ మరింత మెరుగ్గానూ, కచ్చితంగానూ ఉంటాయని ఇస్రో అధికారులు భావిస్తున్నారు. విదేశీ ప్రభుత్వ నియంత్రణలో ఉండే గ్లోబల్ నేవిగేషన్ శాటిలైట్ సిస్టమ్… అన్ని పరిస్థితుల్లోనూ మనకు సేవలు అందిస్తుందన్న హామీ లేకపోవడంతో ఈ ఐఆర్ఎన్ఎస్ఎస్ అవసరమౌతుందని భావిస్తున్నారు. రెండు విధాలుగా సేవలు అందించే ఐఆర్ఎన్ఎస్ఎస్ లో మొదటిది స్టాండర్డ్ పొజిషన్ సర్వీస్ (SPS). ఇది వినియోగదారులందరికీ అందుబాటులో ఉంటుంది. రెండోది రిస్ట్రిక్టెడ్ సర్వీస్ (RS). మిలిటరీ సహా కొంతమంది ప్రముఖుల భద్రతకి మాత్రమే అందుబాటులో ఉంటుంది.
ఇలా సొంత నావిగేషన్ వ్యవస్థను ఏర్పాటు చేసుకునే క్రమంలో.. ఐఆర్ఎన్ఎస్ఎస్ ఉపగ్రహ ప్రయోగాలలో చివరిదైన ఏడవ ఉపగ్రహం పీఎస్ఎల్వీసీ-33 ని కక్షలోకి ప్రవేశపెట్టింది ఇస్రో. నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి 1,425 కిలోల బరువున్న పీఎస్ఎల్వీసీ-33 ని గురువారం కక్షలోకి ప్రవేశపెట్టారు శాస్త్రవేత్తలు. నిర్దేశించిన సమయంలోనే ఉపగ్రహం కక్షలోకి ప్రవేశించడంతో షార్ శాస్త్రవేత్తలు హర్షం వ్యక్తం చేశారు. శాస్త్రవేత్తల పనితీరును ప్రధాని మోడీ అభినందించారు.
ఈ ప్రయోగం విజయవంతం అవ్వడంతో సోంత నావిగేషన్ వ్యవస్థ కలిగిన అతి కొన్ని దేశాల సరసన మన దేశం చేరింది,దీనిలో గర్వించదగిన విషయం ఏమిటంటే భారత రక్షణ వ్యవస్థ ఇక ముందు వేరే వారి జోక్యం లేకుండానే తన భాద్యతలను నిర్వర్తించగలదు ఈ కొత్త విధానంతో మన దేశవాళీ పరిఙ్ఞానంతోనే విపత్తుల సమయంలో, వాహనాల ట్రాకింగ్ లో, నౌకా నిర్వహణ లతో సహా మన చేతుల్లోని మొబైల్ ఫోన్లతో అనుసంధానమై ఉంటుంది. ప్రయాణికులకు కావలసిన లింకులు, వాహనాలు నడిపేవారికి విజువల్, వాయిస్ నేవిగేషన్లతో పాటు మరిన్ని సౌకర్యాలను అందుబాటులో ఉంచుతుంది. ముఖ్యంగా మన దేశానికి సంబంధించిన ముఖ్యమైన ప్రదేశాల వివరాలు వేరే వాళ్ళ చేతికి ముఖ్యంగా ఉగ్రవాదుల చేతికి వెళ్ళకుండా మనమే నియంత్రించుకోవచ్చు. ఈ నావిగేషన్ శాటిలైట్ లు 12 సంవత్సరాల పాటు సేవలు అందించనున్నాయి, వీటి కాలపరిమితి ముగిసే లోపు మరిన్ని శాటిలైట్ లని నింగి లోకి ఇస్రో ప్రయోగిస్తుంది, ఈ విజయంతో మరోసారి దేశం గర్వపడేలా చేసింది ఇస్రో.