పైరసి ప్రస్తుతం సినీ పరిశ్రమను వేధిస్తున్న పెద్ద సమస్య. సినీ నిర్మాతలు కోట్లు ఖర్చు చేసి సినిమా తీస్తే ఇంటర్నెట్ పుణ్యమా అని మొదటి రోజునే ఆన్ లైన్లో ప్రత్యక్షమయ్యి ప్రేక్షకున్ని థియోటర్ కు రాకుండా అడ్డుగా మారింది. దేశవ్యాప్తంగా పలు నిర్మాణ సంస్థలు పైరసీకి అడ్డుకట్ట పడేలా ప్రభుత్వాలు, కోర్టులు తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ముంబయి హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది.
ఆన్లైన్లో పైరసీ సినిమాలు చూడటం నేరం కాదని ముంబయి హైకోర్టు తీర్పునిచ్చింది. అయితే పైరసీ సినిమాలను పబ్లిక్గా చూడటం, డౌన్లోడ్ చేసుకోవడం లేదా ఇతరులకు షేర్ చేయడం వంటివి నేరం కిందకే వస్తాయని జస్టిస్ గౌతమ్ కుమార్తో కూడిన ధర్మాసనం తీర్పు వెల్లడించింది. పైరసీ ఎక్కువ అవడం కారణంగా ఆర్థికంగా ఎంతో నష్టపోతున్నామని ముంబయి ఫిల్మ్ ప్రొడ్యూసర్ల సమాఖ్య కేసు వేసిన నేపథ్యంలో విచారణ చేపట్టి కోర్టు పై విధంగా తీర్పునిచ్చింది.