Home / Entertainment / ప్రణయ్‌ విగ్రహ ఏర్పాటుపై తల్లిదండ్రుల సంఘం తీవ్ర నిరసనలు

ప్రణయ్‌ విగ్రహ ఏర్పాటుపై తల్లిదండ్రుల సంఘం తీవ్ర నిరసనలు

Author:

నల్గొండ జిల్లా మిర్యాలగూడలో తన కూతురు అమృతను ప్రేమించి పెళ్లి చేసుకున్న యువకుడు ప్రణయ్ ను అత్యంత దారుణంగా స్థానిక వ్యాపారి మారుతీరావు చంపించిన సంఘటన రాష్ట్రమంతటా సంచలనం సృష్టించింది. కులం వేరన్న కారణంగా తన భర్త ప్రణయ్ ను… తండ్రి మారుతీరావు హత్య చేయించాడని… కులం లేని సమాజం రావాలని డిమాండ్ చేస్తూ.. ప్రణయ్ విగ్రహాన్ని మిర్యాల గూడ సెంటర్ లో పెట్టాలని అమృత డిమాండ్ చేస్తోంది.

ప్రణయ్‌ విగ్రహాన్ని నల్గొండ జిల్లా మిర్యాలగూడలో ఏర్పాటు చేయాలని చూడటం సరికాదని ఆదివారం తీవ్ర నిరసనలు వ్యక్తమయ్యాయి. మిర్యాలగూడలోని తల్లిదండ్రుల సంఘం ప్రతినిధులు స్థానిక మినీ రవీంద్రభారతి వద్ద సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా భాజాపా రాష్ట్ర నాయకుడు కర్నాటి ప్రభాకర్‌, న్యాయవాది చిలుకూరి శ్యామ్‌ మాట్లాడుతూ.. ప్రణయ్‌ హత్యను తాము తీవ్రంగా ఖండిస్తున్నటు చెప్పారు. ఇది రెండు కుటుంబాల మధ్యలో జరిగిన సమస్య అని, దీన్ని కుల, మతాల సమస్యగా మార్చి సమాజంలోని అందరికీ ఆపాదించటం సరికాదన్నారు. ప్రణయ్‌ విగ్రహాన్ని ఆయనకు చెందిన సొంత స్థలంలో ఏర్పాటు చేసుకోవాలన్నారు.

miryalaguda-in-center-pranay-statue-parents-association-opposing

పట్టణంలో అందరు తిరిగే కూడలిలో ఏర్పాటు చేస్తే భవిష్యత్తు తరాలకు చెడు సందేశం వెళ్లడంతోపాటు ప్రజల మధ్య మరింత అంతరాలు పెరిగిపోయే ప్రమాదం ఉందన్నారు. అక్కడినుంచి నేరుగా వీరంతా ర్యాలీగా డీఎస్పీ కార్యాలయానికి వెళ్లి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా డీఎస్పీ పి.శ్రీనివాస్‌ మాట్లాడుతూ.. ఇప్పటికే ఆర్‌అండ్‌బీ, పురపాలిక అధికారులు ఫిర్యాదు చేసినందున దీనిపై ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. అనంతరం వారు ర్యాలీగా పురపాలిక కార్యాలయం వద్దకు వెళ్లి అధికారులకు వినతిపత్రం అందజేశారు.

(Visited 1 times, 1 visits today)