నిన్న ఐసీసీ లో బిగ్-3 ఆదాయ పంపిణీ విధానాన్ని గెలిపించుకోవడంలో విఫలమైన బీసీసీఐ ని మరిన్ని చిక్కులు వెంటాడుతున్నాయి. 2014 లో భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ), పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ల మధ్య ఇరు జట్లు 6 ద్వైపాక్షిక సిరీసులు ఆడాలని ఒప్పందం కుదిరింది. ఆ ఒప్పందం పై ఇరు బోర్డులు సంతకం చేసాయి. కాని ఆ తరువాత భారత్, పాకిస్తాన్ ల మధ్య సంబందాలు బెడిసికొట్టడంతో పాకిస్తాన్ తో క్రికెట్ ఆడేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి నిరాకరించింది. ప్రభుత్వ అనుమతి లేకపోవడంతో బీసీసీఐ ఈ సిరీస్లు ఆడడం లేదు.
అయితే 2014లో కుదిరిన ఒప్పందం ప్రకారం, భారత్ మాతో 2015 నుంచి 2023 మధ్యలో 6 ద్వైపాకిక్ష సిరీసులు ఆడాల్సి ఉందని దాని కోసం మేము అన్ని ఏర్పాట్లు చేసుకున్నాక ఇప్పుడు భారత్ మ్యాచులు ఆడడానికి నిరాకరిస్తుందని ట్వీట్ చేశారు పీసీబీ ఛైర్మన్ నజమ్ సేథీ. అంతే కాకుండా అనుకున్న విధంగా ఈ సిరీస్ లు జరుగక పోవడం వలన పాకిస్థాన్ క్రికెట్ బోర్డు కు దాదాపు రూ.1200 కోట్లు (200 మిలియన్ డాలర్లు) నష్టం వచ్చినట్లు ఆరోపించారు పీసీబీ ఛైర్మన్. ఈ నష్టాన్ని పూడ్చడానికి పాత ఒప్పందం ప్రకారం భారత్, పాక్ ల మధ్య క్రికెట్ మ్యాచులు జరగాలని లేదంటే నష్టపరిహారం కొరకు బీసీసీఐ పై కోర్టులో దావా వేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు పీసీబీ ఛైర్మన్ నజమ్ సేథీ. మరి దీనిపై బీసీసీఐ ఎలా స్పందిస్తుందో చూడాలి.