పనామా గేట్ కేసులో పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్కు గట్టి షాక్ తగిలింది. ఈ కేసులో నేడు తీర్పు వెలువరించిన పాక్ సుప్రీంకోర్టు.. ఆయనను ప్రధాని పదవికి అనర్హుడిగా ప్రకటిస్తూ సంచలన తీర్పునిచ్చింది. దీంతో ఆయన ప్రధాని పదవి నుంచి తప్పుకోవాల్సి వస్తోంది. నవాజ్ షరీఫ్ తో పాటు పాకిస్థాన్ ఆర్థిక శాఖ మంత్రి ఇషాక్ దార్ను కూడా అనర్హుడిగా ప్రకటిస్తున్నట్లు సుప్రీంకోర్టు వెల్లడించింది. ‘పార్లమెంటులో నిజాయతీగల సభ్యుడిగా కొనసాగేందుకు షరీఫ్కు అర్హత లేదు. ఆయన ఇక ప్రధానిగా కొనసాగదేందుకు వీల్లేదు’ అని పాక్ సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఈజాజ్ అఫ్జల్ ఖాన్ తన తీర్పులో పేర్కొన్నారు.
పనామా గేట్ కుంభకోణం కేసులో పాక్ ప్రధాని నవాజ్షరీఫ్, ఆయన కుటుంబసభ్యులు నిందితులుగా ఉన్న విషయం తెలిసిందే. 1990ల్లో షరీఫ్ ప్రధానిగా ఉన్నప్పుడు లండన్లో ఆస్తులు కొనుగోలు చేసేందుకు గానూ అక్రమ నగదు చెలామణీకి పాల్పడ్డారని నవాజ్ షరీఫ్ తో పాటు అయన కుటుంబ సభ్యులపై అభియోగాలు దాఖలయ్యాయి. అధికారాన్ని అడ్డుపెట్టుకుని బోగస్ కంపెనీల ద్వారా లండన్లో భారీగా ఆస్తులు కూడబెట్టినట్లు పనామా పాత్రలు బయటపెట్టాయి, కానీ.. ఈ ఆరోపణలను పాక్ అధికార పీఎంఎల్-ఎన్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకించింది, దీనిపై విచారణ జరపాలని ప్రతిపక్ష నేతలు సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. సుప్రీం కోర్టు ఒక ప్రత్యేక జాయింట్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (JIT )ని కేసు విచారణకి ఏర్పాటు చేసింది, సమగ్ర విచారణ చేసిన జిట్ రిపోర్ట్ ని గతవారం న్యాయస్థానికి సమర్పించింది, ఆధారాలన్నీ షరీఫ్కు వ్యతిరేకంగా ఉండటంతో షరీఫ్ను అనర్హుడిగా ప్రకటిస్తూ.. సంచలన తీర్పు వెల్లడించింది. ఆయనపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని ఆదేశించింది.ఆరు వారాల్లోగా ఈ కేసు నమోదు చేయాలని పేర్కొంది.
అయితే షరీఫ్ ప్రధాని పదవి నుంచి తప్పుకుంటే పాక్లో ఆకస్మిక ఎన్నికలు తప్పవు. అయితే ఈ ఎన్నికల్లో నవాజ్ షరీఫ్ సోదరుడు, పంజాబ్ ప్రావిన్స్ ముఖ్యమంత్రి షెహ్బజ్ షరీఫ్ పోటీ చేసే అవకాశాలున్నాయి. అయితే ఎన్నికలు పూర్తయ్యేవరకు దేశ రక్షణమంత్రిగా ఉన్న ఖవజా అసిఫ్ తాత్కాలిక ప్రధానిగా బాధ్యతలు చేపట్టే అవకాశం ఉన్నట్లు పాక్ మీడియా వర్గాలు పేర్కొంటున్నాయి.