భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ(ఇస్రో) పీఎస్ఎల్వీ-సీ37 ప్రయోగంతో చరిత్ర సృష్టించింది. ఈరోజు ఉదయం 9.28 గంటలకు శ్రీహరి కోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ లోని లాంచ్ ప్యాడ్ నుండి నింగిలోకి దూసుకెళ్లిన పీఎస్ఎల్వీ- సీ37 వాహకనౌక 104 ఉపగ్రహాలను కక్షలోకి ప్రవేశపెట్టి అనితరసాధ్యమైన పనిని సులువుగా పూర్తి చేసి మన దేశానికి గొప్ప పేరు తీసుకొచ్చింది. పీఎస్ఎల్వీ-సీ37 ద్వార భారత దేశానికి చెందిన కార్టోశాట్ 2 సిరీస్ శాటిలైట్,ఐఎన్ఎస్-1ఏ, ఐఎన్ఎస్-1బీ శాటిలైట్ల తో పాటు ఇతర దేశాలకు చెందిన 101 శాటిలైట్లను కక్షలోకి ప్రవేశపెట్టారు. పీఎస్ఎల్వీ-సీ37 మోసుకెల్లిన మొత్తం శాటిలైట్ల బరువు 1378 కేజీలు.
మొత్తం నాలుగు దశలుగా సాగిన ఈ ప్రయోగం 28 నిమిషాలలో పూర్తి అయ్యింది. అనుకున్న విధంగానే 9 గంటల 28 నిముషాలకు నింగిలోకి ఎగిసిన పీఎస్ఎల్వీ- సీ37 వాహకనౌక బయలదేరిన 17.31 నిమిషాలకు కార్టోశాట్-2 ఉపగ్రహాన్ని నిర్ణీత కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. తర్వాత ఐఎన్ఎస్-1ఎ, ఐఎన్ఎస్-1బి ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. దాని తర్వాత అమెరికాకు చెందిన 96 ఉపగ్రహాలు, ఇజ్రాయెల్, కజకిస్థాన్, నెదర్లాండ్స్, స్విట్జర్లాండ్, యూఏఈ దేశాలకు చెందిన ఒక్కో ఉపగ్రహం నిర్ణీత కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. ఈ విజయవంతమైన ప్రయోగం ద్వారా భారత సంస్థ ఇస్రో అంతరిక్ష రంగంలో మరో మైలురాయిని అందుకుంది.