మనదేశంలో ఎన్నో వందల సంవత్సరాల నుండి ఉన్న దురాచారాలలో బాల్య వివాహం ఒకటి, ఈ దురాచారం వల్ల ఎంతో మంది జీవితాలు నాశనం అయ్యాయి, ముఖ్యంగా అమ్మాయిలకి చిన్నతనంలో పెళ్లి చేయడం వల్ల వాళ్ళు చదువుకోవాల్సిన వయస్సులో అత్తింటి భారాన్ని మోయాల్సి వస్తుంది, మన సమాజం ఆధునిక నాగరికత వైపు పరిగెడుతున్న కొన్నిచోట్ల బాల్య వివాహాలు జరుగుతూనే ఉన్నాయి, హైదరాబాద్ లాంటి మహానగరంలోనే బాల్య వివాహాలు జరుగుతుండటం దురదృష్టకరమైన విషయం, హైదరాబాద్ లో ఇటీవల జరిగిన సంఘటనల వల్ల బాల్య వివాహాల వల్ల కలిగే నష్టాల గురుంచి అర్ధం చేసుకోవచ్చు.
వనస్థలిపురం ప్రాంతానికి చెందిన కె.సంధ్య, వి.సంధ్య స్నేహితురాళ్ళు, వారి పేర్లలాగే వాళ్ళు కూడా చదువుల్లో ఒకే రకంగా ప్రతిభ చూపుతారు, హయత్ నగర్ తుర్కయాంజల్లో ఉన్న ఓ ప్రైవేటు పాఠశాలలో వీరిద్దరూ గతేడాది 10వ తరగతి చదివారు. అయితే 10 వ తరగతి వార్షిక పరీక్షలు జరుగుతున్న సమయంలో వి.సంధ్య తల్లిదండ్రులు ఆమెను చివరి పరీక్ష రాయనీయకుండా పెళ్లికి ముహూర్తం ఫిక్స్ చేశారు. ఈ విషయం తెలుసుకున్న ఆమె స్నేహితురాలు కె.సంధ్య బాలల హక్కుల సంఘం అనే ఓ ఎన్జీవోకు తెలియజేసింది. దీంతో ఎన్జీవో వారు వచ్చి వి.సంధ్యను రక్షించారు. ఆ తరువాత మరికొద్ది రోజులకు కె.సంధ్య తల్లిదండ్రులు కూడా ఆమెకు ఎంగేజ్మెంట్ చేశారు. దీంతో ఈ విషయాన్ని వి.సంధ్య అదే ఎన్జీవోకు చెప్పింది. ఈ క్రమంలో కె.సంధ్యకు కూడా పెళ్లి కాకుండా ఎన్జీవో వారు రక్షించారు.
అలా ఎన్జీవో సహాయంతో బాల్య వివాహం నుండి బయట పడ్డ ఆ అమ్మాయిలు పది తరగతిలో ఉత్తమ ప్రతిభ కనబరిచారు, ఇంటర్ లో కూడా ఎన్జీవో సభ్యులే స్థానికంగా హయత్ నగర్ లో ఉన్న NRI జూనియర్ కళాశాలలో చేర్పించారు, మొన్న వచ్చిన ఇంటర్ ఫలితాలలో 93 శాతం మార్కులతో కె.సంధ్య మొదటి స్థానంలో నిలవగా, 92 శాతం మార్కులతో వి.సంధ్య రెండో స్థానంలో నిలిచింది. బాల్య వివాహం నుండి రక్షింప పది చదువులలో ఉత్తమ ప్రతిభ కనబరచడంతో అందరు ఆ అమ్మాయిలని అభినందిస్తున్నారు, ఎన్జీవో సహాయంతో బాలవివాహానికి అడ్డుకట్ట పడింది లేకపోతే వాళ్ళు ఈరోజు మంచి మార్కులు సాధించేవారు కాదు, వాళ్ళు భవిష్యత్ లో ఉన్నత శిఖరాలకి చేరుకోవాలని కోరుకుందాం, ఇంకా ఎందరు ఇలాంటి బాలికలు మన దేశంలో ఉన్నారో, వారిని ఎవరు రక్షిస్తారో ఆ దేవుడికే తెలియాలి..!