కొన్ని శతాబ్దాలుగా శాస్త్రవేత్తలు, డాక్టర్లు కలిసి చేస్తున్న ప్రయోగాలు, ప్రయత్నాలు ఫలించనున్నాయి. మనిషిని మృత్యుంజయుడినిగా మార్చే దిశగా వందల ఏళ్లుగా పరిశోధనలు జరుగుతున్నాయి. అయితే రీసెంట్ గా నిండు నూరేళ్ల ఆయుష్షుకు కారణంగా భావిస్తున్న జన్యువును జపాన్ శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ జన్యువు ద్వారా కాన్సర్ ని, వృద్ధాప్యాన్ని కూడా రాకుండా ఆపగలం అంటున్నారు డాక్టర్లు. కియో యూనివర్సిటి, టోక్యో మెట్రోపాలిటన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ జెరంటాలజీకి చెందిన పరిశోధకులు సంయుక్తంగా కనుగొన్న ఈ మహా మృత్యుంజయ జన్యువు పేరే సీఎల్ఈసీ3బీ.
దాదాపు 5 వేల మంది వృద్ధులపై రకరకాల పరీక్షలు చేసిన తర్వాతే ఇంత స్పష్టంగా చెబుతున్నాం అంటున్నారు పరిశోధకులు. 95 ఏళ్లు పైబడిన వృద్ధులు 530 మంది, 80 ఏళ్లు లోపు వయసున్న4,312 మంది నుంచి సేకరించిన రక్త నమూనాలను, వారి డీఎన్ఏలను విశ్లేషించారు. వందేళ్లు దాటిని వృద్ధులందరిలోనూ క్యాన్సర్ నిరోధక, ఎముక పుష్టి కారక మాంసకృత్తు టెట్రానెక్టిన్ స్థాయి అధికంగానే ఉన్నట్లు తేలింది. సీఎల్ఈసీబీ3 అనే జన్యువు కారణంగానే నిరోధక ప్రొటీన్ స్థాయులు ఎక్కువగా ఉన్నట్లు తేలింది. ఇదే కాన్సర్ నిరోధకతకు కూడా తోడ్పడుతుంది.
నూరేళ్ల వృద్ధుల్లో జీవితకాలం 30% పెరగడానికి కూడా ఈ జన్యువే దోహదపడుతోందట. అయితే, తాము కనుగొన్న ఈ ఒక్క జన్యువే దీర్ఘాయుష్షుకు కారణo కాకపోవచ్చు. కానీ, వృద్ధాప్యాన్ని అడ్డుకోవడంలో మాత్రం ఈ జన్యువే కీలక పాత్ర పోషిస్తోందని మాత్రం స్పష్టమైంది అన్నారు ఈ పరిశోధన బృందానికి నేతృత్వం వహించిన మసాషి తనాక. ముందు ముందు మరిన్ని పరిశోధనల్లో ఈ జన్యువు కచ్చితత్వం సత్పలితాలిస్తే… క్యాన్సర్ను రూపుమాపడమే కాదు, మనిషి ఆయుష్షుని పెంచే వీలుందని చెప్పారు మసాషి. ఈ ప్రయోగాలూ ఫలించి కాన్సర్ రహిత సమాజాన్ని చూద్దామని మనమూ ఆశిద్దాం.