నెల రోజులు తినకుండా అయినా ఉండగలం కానీ 3 రోజుల మించి నిద్ర లేకుండా ఉండలేమన్నది జగమెరిగిన సత్యం. ఇక్కడే అర్థం అవుతుంది ప్రతి మనిషికి నిద్ర యొక్క ఆవశ్యకత. తిండి లేకున్నా శరీరం తట్టుకుంటుంది కానీ నిద్రలేకపోయినా, తగ్గినా శారీరక, మానసిక సమస్యలు పెరిగి ఆరోగ్యం పూర్తిగా దెబ్బతింటుందని హెచ్చరిస్తున్నారు డాక్టర్లు. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది ఇబ్బంది పడుతోంది ఈ నిద్రలేమి తోనే.
పెరుగుతున్న జనాభా, కాలుష్యం, బిజీ లైఫ్ వల్ల ఈ నిద్ర లేమి ఇంతకుముందు కేవలం నగరాలకే పరిమితం అయ్యేది కానీ ఇప్పుడు గ్రామీణ, పట్టణ ప్రజల్లో కూడా నిద్రలేమి పెద్ద సమస్యగా కనిపిస్తోంది. రాత్రిపూట సరిగా నిద్రపోకపోతే ఉదయానికి కాళ్లు, చేతులు తిమ్మిర్లు ఎక్కడం తో పాటూ బీపీ, ఒత్తిడి పెరుగుతుంది. గుండె స్పందన వేగంలో కూడా తేడాలొస్తాయి. బరువు పెరగడం, షుగర్ సమస్యలు ఎక్కువవడం వంటి సమస్యలు ఉత్పన్నమయ్యే ప్రమాదం కూడా ఉందంటున్నారు డాక్టర్లు.
అయితే, అసలు నిద్ర పట్టకపోవడానికి కారణాలేంటని పరిశీలిస్తే.. అధిక బరువు. తీవ్రమైన పని ఒత్తిడి, టీవీ చూడడం, సెల్ఫోన్ ఎక్కువగా మాట్లాడటమే కాదు. టీ, కాఫీ, మద్యం, సిగరెట్లు విపరీతంగా తాగడం, రాత్రి పూట ఉద్యోగాల వల్ల కూడా ఈ నిద్రలేమి సమస్య వస్తుంది.
ఈ నిద్రలేమి వల్ల పలు ఆరోగ్య సమస్యలు కూడా ఉత్పన్నమవుతాయి. ఎప్పుడూ చిరాకుగా ఉండటం, పనిమీద ధ్యాస తగ్గడం, మానసిక ఆందోళన, ఆతృత, భయాందోళనలి, నరాల్లో బలహీనతలే గాక రోగ నిరోధక శక్తి సన్నగిల్లడం వంటి అనేక సమస్యలు ఏర్పడతాయి. ఒక్క నిద్ర లేకపోతే ఇన్ని సమస్యలు ఉత్పన్నమవుతాయంటే ఇంక మీకు నిద్ర ఎంత ముఖ్యమో తెలుసుకోండి.
అయితే ఈ నిద్రలేమి సమస్యలు ఎదుర్కొంటున్న వారు ఆఫీసు నుంచి ఇంటికి రాగానే స్నానం చేయాలి. రాత్రి 8 గంటల లోపే భోజనం చేసేసి పడుకోవాలి. వీలైనంత వరకు టీ, కాఫీ, మద్యం, సిగరెట్ అలవాట్లను మానేయాలి. ఇక రాత్రి 9 గంటల తర్వాత టీవీ చూడడం, గంటలతరబడి సెల్ఫోన్తో గడపం మానేయాలి. ప్రతి రోజూ తప్పని సరిగా 6 నుంచి 8 గంటలు నిద్రపోయేలా చూసుకుంటే ఈ సమస్య నుంచి గట్టెక్కవచ్చని డాక్టర్లు సలహా ఇస్తున్నారు. కాబట్టి కడుపు నిండా తిండే కాదు.. కంటి నిండా నిద్రా అవసరమే..