తమిళనాడు లోని ఒక పెళ్ళిలో జరిగిన ట్విస్ట్ ఇప్పుడు దేశం మొత్తం వైరల్ గా మారింది. పెళ్లి పీటలపై పెళ్ళి కొడుకు, కూతురు కూర్చున్నారు. పెళ్ళి కొడుకుని వధువుకి తాళి కట్టమని చెప్పాడు పురోహితుడు. దానికి పెళ్ళికొడుకు రెడీ అవుతుండగానే పక్కనే ఉన్న పెళ్ళి కొడుకు తమ్ముడు, తన అన్నను పక్కకు తోసేసి, వధువు మెడలో తాళి కట్టాడు. ఈ అరుదైన సంఘటణ తమిళనాడులోని వేలూరు సమీపంలో జరిగింది.
వేలూరు జిల్లాలోని తిరుపత్తూరు సెల్లరైపట్టికి చెందిన రాజేష్ కి మదురైకి చెందిన ఓ యువతితో వివాహం నిశ్చయమైంది. గురువారం ఉదయం దగ్గరలోని మురుగన్ ఆలయంలో వివాహానికి ఏర్పాట్లు చేసారి ఇరు కుటుంబాలు. పెళ్లి పీటలపై కూర్చున్న రాజేష్ వధువు మెడలో మంగళ సూత్రం కట్టడానికి లేస్తుండగా పక్కనే ఉన్న అతని తమ్ముడు వినోద్, అన్నను పక్కకు తోసేసి తన జేబులో దాచుకున్న మరో తాళిని తీసి వధువు మెడలో కట్టాడు. దీనితో నిర్ఘాంతపోయిన వరుడు రాజేష్ తన తమ్ముడిని ఏమనలేక ఆవేదనకు గురై అక్కడి నుంచి వెళ్లిపోయాడు. కోపోద్రిక్తులైన బంధుమిత్రులు, తల్లిదండ్రులు అసలు విషయం కనుక్కోగా రాజేష్కు పెళ్లి చూపులు చూడడానికి వెళ్ళినప్పుడే తనకు వధువు పరిచయం అయ్యిందని, అప్పటి నుండి తామిద్దరం ప్రేమించుకుంటున్నామని తెలిపాడు వినోద్. ఇక చేసేదేమి లేక వారిద్దరిని ఆశీర్వదించారు పెద్దలు.