అక్కడెక్కడో ఇంగ్లాండ్ లో పుట్టిన హాకీని జాతీయ క్రీడగా చేసుకొని, అదే ఇంగ్లీష్ వాళ్ళు కనిపెట్టిన క్రికెట్ మత్తులో ఉండి, అచ్చంగా మన గ్రామాల్లో పుట్టిన అసలైన భారతీయ క్రీడ అయిన కబడ్డీ చిన్నచూపు చూసాం, కానీ గత రెండు సంవత్సరాల నుండి కబడ్డీ రూపు రేఖలే మారిపోయాయి, క్రికెట్ తరువాత మనదేశంలో ఎక్కువ మంది ఆదరిస్తున్న ఆటగా కబడ్డీ నిలిచింది, ఇదంత ప్రో కబడ్డీ లీగ్ పుణ్యమే, ప్రో కబడ్డీ తో కబడ్డీ ఆటగాళ్ల జీవితాలే మారిపోయాయి, దేశానికి గోల్డ్ మెడల్స్ తీసుకవచ్చినప్పుడు కూడా రాని పేరు ఒక్క ప్రో కబడ్డీ లీగ్ తో వచ్చింది, ఒకప్పుడు కబడ్డీలో పథకాలు తెచ్చి కూలీ పనులు చేసుకుంటున్న ఆటగాళ్లు ప్రో కబడ్డీతో సెలబ్రెటీల హోదాలో పెద్ద పెద్ద కార్లలో తిరుగుతున్నారు, దీనికి మూల కారణం ఒకప్పుడు కబడ్డీ వ్యాఖ్యాతగా పని చేసిన చారు శర్మనే.
2006 దోహా ఆసియా గేమ్స్ లో కబడ్డీ కామెంటరీ చెప్పినపుడు చారు శర్మ బుర్రలో మెరిసిన ఆలోచనే ప్రో కబడ్డీ లీగ్గా మన ముందుకు వచ్చింది, జనాన్ని ఆకట్టుకోగల సరుకు ఈ ఆటలో ఉన్న సంగతి అతను గుర్తించాడు, ఆలోచన అయితే వచ్చింది కానీ దానికి సపోర్ట్ చేయడానికి ఎవరు ముందుకు రాలేదు, మహింద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహింద్రా, చారు శర్మకు స్వయానా బంధువు కావడంతో కార్పొరేట్ సపోర్టు దొరికి ఆ ఆలోచన కార్యరూపం దాల్చింది. అయితే ప్రత్యక్ష ప్రసారానికి టీవీ చానెల్స్ మాత్రం ముందుకు రాలేదు. ఆరు నెలలు చెప్పులరిగేలా తిరిగారు. అదే సమయంలో క్రికెట్కు ప్రత్యామ్నాయాలు వెదుకుతూ స్టార్ స్పోర్ట్స్ ఛానెల్ వారికి తారసపడింది. చారు శర్మ ఆలోచన నచ్చి కబడ్డీ లీగ్ను ప్రసారం చేసే సాహసానికి పూనుకొంది. అలా 2014లో ప్రొ కబడ్డీ లీగ్ తెరమీదికొచ్చింది. తొలి సీజన్లోనే బాహుబలి లెవల్లో బ్లాక్బస్టర్ బంపర్ హిట్ అయింది. ప్రతి సీజన్కూ ప్రేక్షకుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఇప్పుడు మన దేశంలో క్రికెట్ తర్వాత టీవీ ప్రేక్షకులు అత్యధికంగా చూసే క్రీడ కబడ్డీనే. కబడ్డీకి ఎంతటి క్రేజ్ వచ్చిందంటే ఈ ఏడాది నుంచి ప్రతిఏటా రెండేసి సార్లు ఈ లీగ్ మన ముందుకొస్తోంది.
మాములు బిర్యానీని కూడా ఆకర్షణీయంగా అలంకరించి సర్వ్ చేస్తే మరింత రుచిగా అనిపిస్తుంది, చారు శర్మ టీమ్ కూడా అదే చేసింది, మట్టిలో ఆడే కబడ్డీలో మ్యాట్ మీదకి తెచ్చారు, రైడింగ్ సమయాన్ని 30 సెకండ్లకి మార్చారు, పాయింటు ఖచ్చితంగా తేవాల్సిన ‘డూ ఆర్ డై రైడ్’ ని, సూపర్ టాకిల్, సూపర్ రైడ్ లని ప్రవేశ పెట్టి ఆటని ఇంకా ఆసక్తిగా మార్చారు, క్రికెట్ లో ఫోర్, సిక్స్ లేదా వికెట్ తీసినప్పుడు మాత్రమే ఊపొస్తుంది కానీ కబడ్డీలో అలా కాదు ప్రతి క్షణం ఊపు మీదనే ఉంటాం, 40 నిమిషాల ఆటలో ఎక్కడా బోర్ కొట్టే చాన్స్ లేదు, అంతలా ఆటతో కనెక్ట్ అయిపోతాం.
ఇప్పుడు విజయవంతంగా మూడు సీజన్ లని పూర్తి చేసుకొని నాలుగో సీజన్ ని స్టార్ట్ చేయబోతున్నారు, ఈరోజు ముంబై లో తెలుగు టైటాన్స్ , పుణేరి పల్టాన్ ల మధ్య మొదటి మ్యాచ్ జరగబోతుంది, ఈసారి కూడా ఎనమిది జట్లు టైటిల్ కోసం పోటీ పడుతున్నాయి, ఈ లీగ్ లో మొత్తం 60 మ్యాచ్ లు జరుగుతాయి, సెమీ-ఫైనల్ , ఫైనల్ మ్యాచ్ లు హైదరాబాద్ లో జరగనున్నాయి, ప్రో కబడ్డీలోనే స్టార్ రైడర్ అయిన రాహుల్ చౌదరి సారధ్యంలో ప్రతిసారి అద్భుతంగా ఆడి చివరలో చేతులు ఎత్తేసే మన తెలుగు టైటాన్స్ జట్టు ఈసారైనా టైటిల్ గెలవాలని కోరుకుందాం.
Click Here: Pro Kabaddi Schedule.