సినిమాలలో రాజకీయ విలన్లు తమకు సహకరించని, బాగా పనిచేస్తున్న అధికారులను వేరే ప్రాంతాలకు బదిలీ చేయించడం చూస్తుంటాం కాని నిజ జీవితంలో కూడా సినిమాలకు మించి రాజకీయ నాయకులు అధికారులను బదిలీలతో వేధిస్తారని తెలుసా? అందుకు నిలువెత్తు ఉదాహరణ హర్యాణాకు చెందిన ఐఏఎస్ అధికారి ప్రదీప్ కస్ని. అవినీతిని అడ్డుకుని రాజకీయనాయకుల తప్పుడు పనులకు సహకరించనందుకు ప్రదీప్ గారిని 33 యేళ్ళలో 68 సార్లు వివిధ ప్రాంతాలకు బదిలీ చేసి కసి తీర్చుకున్నారు హర్యాణా ప్రభుత్వంలోని అవినీతి రాజకీయ నాయకులు. వారి వేధింపులు ఏ స్థాయిలో ఉన్నాయంటే 2016 సెప్టెంబర్ నెలల్లో అయన్ను ఏకంగా మూడు సార్లు వివిధ ప్రాంతాలకు ట్రాన్స్ ఫర్ చేసారు.
1984 లో రాష్ట్ర పౌర సేవ అధికారిగా ఉద్యోగం ప్రారంభించిన కస్ని గారు 1997 లో ఐఏఎస్ అధికారి హోదా పొందారు. తనకు ఏ బాధ్యత అప్పజెప్పిన నిబద్దతతో చేసే ఈ అధికారి మొదటినుండి రాజకీయ నాయకుల బెదిరింపులకు, ఒత్తిడికి లొంగలేదు. దీనితో ఆయనపై కక్ష కట్టిన అవినీతి రాజకీయ నాయకులు ఆయనను ఏమాత్రం ప్రాధాన్యత లేని శాఖలకు, మారుమూల ప్రాంతాలకు ట్రాన్స్ ఫర్ చేయడం మొదలు పెట్టారు. ఎక్కడికెళ్ళిన ఆ శాఖలోని, ప్రాంతంలోని అవినీతిని అడ్డుకుంటుండడంతో ఆ ప్రాంతంలోని రాజకీయ నాయకుల ఒత్తిడితో అతన్ని మరో ప్రాంతానిక్ బదిలీ చేసే వారు. ఇలా ఇప్పటికి 68 సార్లు బదిలీ చేసారు. పారదర్శకత, అవినీతి రహిత ప్రభుత్వం అంటూ పెద్ద పెద్ద మాటలు చెప్పే బిజెపి పార్టీ ప్రభుత్వం వచ్చిన తరువాత కూడా కస్ని కి వేధింపులు ఆగలేదు. గత రెండున్నర సంవత్సరాలలో బిజెపి ప్రభుత్వం కూడా ఆ మంచి అధికారిని 13 సార్లు బదిలీ చేసింది. కాని ఈ బదిలీలకు, వేదింపులకు జంకకుండా తనకు ఏ బాధ్యత ఇచ్చిన నిబద్దతతో నెరవెర్చుతున్న ప్రదీప్ కస్ని గారు అందరికి ఆదర్శం.