72 బంతులు..300 పరుగులు ఇదేదో వీడియో గేమ్ లో ఆడిన ఆట కాదు సాక్షాత్తు మన దేశానికి చెందిన యువ కుర్రాడు టీ20 క్రికెట్ మ్యాచ్ లో చేసిన పరుగులు. ఇదెలా సాధ్యం అవుతుంది అనుకుంటున్నారా..? ఈ అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపించాడు 21 ఏళ్ల యువ క్రికెటర్ మోహిత్ అహ్లావత్. అయితే ఈ టీ-20 మ్యాచ్కు ఎలాంటి అధికారిక గుర్తింపు లేదు. ఢిల్లీ జట్టుకు చెందిన వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ మోహిత్ ఈ టీ20 మ్యాచ్ లో ఏకంగా 39 సిక్సులు, 14 ఫోర్లు బాది 300 వ్యక్తిగత స్కోరును సాధించాడు. తాను చేసిన 300 పరుగులో 290 బౌండరీల రూపంలో సాధించిందంటే ప్రత్యర్థి బౌలర్ల పై ఎంతలా విరుచుకపడ్డాడో అర్ధం చేసుకోవచ్చు. ఇప్పటి వరకు అంతర్జాతీయ క్రికెట్లో గానీ, దేశవాళీ క్రికెట్లోగానీ ఏ క్రికెటర్ వ్యక్తిగత స్కోరు 200 పరుగులను అందుకోలేదు. కానీ మోహిత్ మాత్రం మంగళవారం, అంటే నిన్న జరిగిన మ్యాచ్లో ఏకంగా 300 పరుగులు చేసి అందరిని ఆశ్చర్య పరిచాడు.
ఇప్పటి వరకు ప్రొఫెషనల్ క్రికెట్ అయిన ఐపీఎల్లో బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ జట్టు తరపున వెస్టిండీస్ ఆటగాడు క్రిస్గేల్ 2013లో పూణే వారియర్స్ పై, 66 బంతులు ఆడి 175 పరుగులు చేశాడు ఇప్పటి వరకు ఈ రికార్డు నే ఎవరు దాటలేకపోయారు. మరోవైపు అంతర్జాతీయ టీ20 మ్యాచ్ లో ఆస్ట్రేలియాకు చెందిన ఆరోన్ ఫించ్ ఇంగ్లాండ్ జట్టుపై 63 బంతుల్లో 156 పరుగులు చేశాడు. అంతర్జాతీయ టీ20 మ్యాచ్ లో ఫించ్ చేసిన 156 పరుగులే ఇప్పటి వరకు అత్యధిక వ్యక్తిగత స్కోరు. అంతేకాదు, టీ20ల్లో ఏ జట్టు 300 పరుగుల స్కోరు ఇప్పటి వరకు చేసిందిలేదు. ఇప్పటి వరకు టీట్వంటీల్లో నమోదైన జట్టు అత్యధిక స్కోరే 263 పరుగులు. అలాంటిది, ఒక్క బ్యాట్సమెన్ 300 పరుగులు సాధించటం అలాంటిది కేవలవం 73 బంతుల్లోనే అంటే మామూలు విషయం కాదు. మోహిత్ సాధించిన ఈ పరుగులతో ఒక్కసారిగా స్టార్ గా మారి దేశం దృష్టిని తనవైపు తిప్పుకున్నాడు.