ప్రస్తుతం టీవీ లేని ఇల్లు లేదు అనడంలో అతిశయోక్తి ఏం లేదు అనుకుంట. ఎందుకంటే వినోదాంకి మనం అంత విలువ ఇస్తాము. ఫుల్ ఎనర్జీ తో ఉన్నప్పుడు మనం చూసేది టీవీ..బాగా అలసిపోయి ఇంటికి వచ్చాక కూడా మనం చూసేది టీవీ. కొంతమంది ఇళ్లల్లో అయితే ఆ టీవీ రోజు మొత్తం మోగుతూనే ఉంటుంది. అయితే ఇప్పుడు టీవీ ప్రియులకు ఓ షాకింగ్ న్యూస్. నేరుగా ఇంటికే ప్రసారాలు (డీటీహెచ్) అందించే సంస్థలతో పాటు కేబుల్ టీవీ నిర్వాహకులు కూడా జనవరి 1 నుంచి టెలికాం నియంత్రణ సంస్థ (ట్రాయ్) ఆదేశాల ప్రకారమే సేవలు అందించడంతో పాటు ఛార్జీలు వసూలు చేయాల్సి ఉండటమే ఇందుకు కారణం.
ఇప్పటివరకు కేబుల్ టీవీ అంటే, నెలకు ఇంతని చెల్లించి, వారు ప్రసారం చేసే చానళ్లు తిలకించడమే. అనలాగ్ నుంచి డిజిటల్కు ప్రసారాలు మార్చి, సెట్టాప్ బాక్స్ ఏర్పాటు చేశాక కూడా పరిస్థితేమీ మారలేదు. చిత్రం, మాటలో స్పష్టత మాత్రం పెరిగింది. పట్టణాలు, నగరాల్లో 250 నుంచి 400 చానళ్ల వరకు ప్రసారాలకు వేర్వేరు సంస్థలు రూ.200-400 వరకు వసూలు చేస్తున్నాయి. వీటిలో ఉచితంగా లభించే వార్తా చానళ్లతో పాటు వినోదం, చిత్రాలు, వంటల ప్రోగ్రామలు, క్రీడాచానళ్లు, హిందీ-ఆంగ్ల-తమిళం-మళయాళం-ఉర్దూ చానళ్లు కూడా ఉంటున్నాయి.
ఇప్పటి వరకు వందల కొద్ది ఛానెల్స్ను కేబుల్లో ప్రసారం చేసినా కూడా నామమాత్రపు ధరను మాత్రమే వసూళ్లు చేసేవారు. కాని ఇప్పుడు మాత్రం వంద ఛానెల్స్కు మించి ఛానెల్స్ కోరుకునే వారు ఇకపై డబ్బులు చెల్లించాల్సిందే. ఇప్పటికే కేబుల్ ఆపరేటర్లకు ఈ విధమైన స్పష్టమైన ఆదేశాలు వెళ్లాయి.కొన్ని నెట్వర్క్ సంస్థలకు చెందిన వారు ఇప్పటికే రేట్లను ఫిక్స్ చేశారు. ఆ రేట్ల ప్రకారం జనవరి 1 నుండి కేబుల్ వినియోగదారులు కూడా భారీగా చెల్లించాల్సి ఉంటుంది.
ఇకపై కేబుల్ టీవీ కనెక్షన్కు కూడా ప్రీపెయిడ్ పద్ధతిలోనే చెల్లింపులు జరపాల్సి వస్తుంది. 100 ఉచిత చానళ్లను మాత్రం కేబుల్ టీవీ సంస్థలన్నీ రూ.130+జీఎస్టీకి వసూలు చేయాల్సి ఉంటుంది. తదుపరి కావాల్సిన చానళ్లకు మాత్రమే చెల్లింపులు జరిపితే సరిపోతుంది. అయితే ప్రస్తుతం లభిస్తున్న చానళ్లన్నీ చూడాలంటే మాత్రం ధర గణనీయంగా పెరుగుతుంది. కనీసం తెలుగులో సీరియళ్లు, సినిమాలు ప్రసారం చేసే చానళ్లన్నీ చూడాలన్నా కూడా, ప్రస్తుతం కంటే ఎక్కువ మొత్తమే (కనీసం రూ.300కు పైగా) చెల్లించాల్సి వస్తుందనే అభిప్రాయాన్ని మాస్టర్ నెట్వర్క్ ఆపరేటర్లు వ్యక్తం చేస్తున్నారు. హెచ్డీ చానళ్లకు మరింత అధికంగా ధర ఉండొచ్చు.నూతన విధానానికి ఈనెల 29 కల్లా సిద్ధం కావాల్సి ఉందని హైదరాబాద్లోని సిటీ నెట్వర్క్ ఎండీ కంచర్ల శివరామకృష్ణ వెల్లడించారు. ప్రస్తుతం 400 చానళ్లు ప్రసారం చేస్తున్నా, నెలకు రూ.250 మాత్రమే వసూలు చేస్తున్నట్లు తెలిపారు. ఇకపై కుటుంబీకులు చర్చించుకుని, అవసరమైన చానళ్లకే చెల్లింపులు జరిపే పరిస్థితి వస్తుందన్నారు.
ఇకపై కొన్ని ఛానెల్స్ను మాత్రమే వినియోగదారులు ఎంపిక చేసుకోవడం మంచిది. తెలుగు వారు అన్ని తెలుగు ఛానెల్స్ను చూడాలంటే కనీసం మూడు వందల రూపాయలు ఖర్చు చేయాల్సి ఉంటుంది. అందుకే తెలుగు చానెల్స్లో కొన్ని ఛానెల్స్ను ఎంపిక చేసుకోవడం మంచిది. మొత్తానికి ఇకపై స్వేచ్చగా టీవీని కూడా చూసే పరిస్థితి లేదు.