జన్మ నిచ్చే అమ్మ, కట్టుకున్న భార్య ఆడది కాని పుట్టే బిడ్డ మాత్రం ఆడది కాకుడదని భావిస్తారు ఆ ఊరి జనం, అలా అనుకుని పుట్టిన ఆడబిడ్డలను కాటికి పంపించి అసలు ఊరిలో ఆడపిల్లలు లేకుండా చేసుకున్నారు. సమాజంలో విప్లవాత్మక మార్పులు జరిగి మహిళలు అన్ని రంగాలలో దూసుకుపోతుంటే ఆ గ్రామ సర్పంచ్ తనకు ఆడపిల్ల పుట్టిందని ఆ బిడ్డను చంపేసి కటకటాలపాలయ్యాడు. ఆ ఊరే మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న భింధ్ జిల్లాలోని గుమారా గ్రామం. కాని ఇంత కిరాతక గ్రామంలో కూడా ఒక మంచి కుటుంబం చేసిన పనికి ఇప్పుడు ఆ ఊరు ఊరంతా పండుగ చేసుకుంటుంది.
ఫుట్టిన ఆడబిడ్డను పురిటిలోనే మట్టుబెట్టే ఆ ఊరిలోని కొన్ని కుటుంబాలు తమకు పుట్టిన ఆడబిడ్డలను చంపుకోలేక చాల బాధలకు ఓర్చి వారిని పెంచుకున్నారు. తద్వారా ఇప్పుడు 40 సంవత్సరాల తరువాత గుమారా గ్రామంలో ఆర్తి గుర్జార్ అనే 18 ఏళ్ల యువతి పెళ్లిపీటలెక్కబోతోంది. 40 ఏళ్ల తర్వాత జరుగుతున్న తొలి యువతి వివాహం కావడంతో ఆ గ్రామంలో సంతోషం వెల్లివిరువడంతో పాటూ ఇన్నాళ్ళు తమ ఆడబిడ్డలను చంపుకున్న కుటుంబాలు తమ చర్యలకు సిగ్గు పడుతున్నాయి. 18 ఏళ్ల ఆర్తి గుర్జార్ ఇప్పుడు 12 తరగతి పూర్తి చేసుకుంది ఆమే వివాహం డిసెంబర్ లో జరగనుంది. ఇప్పటికైన ఆ ఊరు వారు ఆడబిడ్డలపై ఉన్న తమ అభిప్రాయాన్ని మార్చుకొని వారికి కూడా జీవించే హక్కు ప్రసాదిస్తే చాలా బాగుంటుంది.