ఉక్కునగరం విశాఖలో సాగర తీరాన కొత్తగా ‘సీ పూల్స్’ నిర్మించాలని అధికారులు యోచిస్తున్నారు. ఆ యోచన అమలైతే దేశంలోనే ఇది తొలి ప్రయోగం అవుతుంది. విశాఖపట్నం వచ్చే పర్యాటకులు, స్థానికులు చాలామంది సరదాగా బీచ్ కు వచ్చి, స్నానాలకు సముద్రంలో దిగుతున్నారు. లోతు తెలియక లోపలకు వెళ్లి పెద్ద కెరటాలు వచ్చినప్పుడు మునిగి చనిపోతున్నారు.
ఇటీవల కాలంలో ఈ ప్రమాదాల సంఖ్య బాగా పెరిగింది. గత ఏడాది కాలంలోనే 50 మంది ఇలా చనిపోయారు. దీంతో.. ఈ మరణాలను నిరోధించడం ఎలా అనే అంశంపై ఇటీవల నేవీ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించినపుడు చర్చించారు. ఆ చర్చలో.. అమెరికాలోని కాలిఫోర్నియాలో సముద్రాన్ని ఆనుకొని నిర్మించే ‘సీ పూల్స్’ ప్రస్తావన వచ్చింది. అక్కడ బీచ్లకు వెళ్లే పర్యాటకులు వాటిలోనే స్నానాలు చేస్తారని, దీంతో ఎటువంటి ప్రమాదాలూ జరగట్లేదని నేవీ అధికారులు పేర్కొన్నారు. భారతదేశంలో ఆ తరహా పూల్స్ ఎక్కడా లేవని, విశాఖలో ప్రయోగాత్మకంగా చేపట్టి, విజయవంతమైతే.. 23 కిలోమీటర్ల బీచ్ పొడవున ఎక్కడ కావాలంటే అక్కడ నిర్మించుకోవచ్చునని సూచించారు. దీనిపై స్పందించిన కలెక్టర్.. మహా విశాఖ నగరపాలక సంస్థ దీనిపై డీపీఆర్ రూపొందించి, పైలట్ ప్రాజెక్టుగా చేపట్టాలని సూచించారు.
సీ పూల్ ఎలా వుంటుంది?
పర్యాటకులు అధికంగా వచ్చే బీచ్ లోనే ఓ పూల్ నిర్మిస్తారు. స్విమ్మింగ్ పూల్లో ఉన్నట్టుగా మంచినీటిని కాకుండా ఇందులో సముద్రపు నీటినే నింపుతారు. అక్కడ స్నానానికి వచ్చే వారి వయస్సును బట్టి లోతును నిర్ణయిస్తారు. పిల్లలకు 4 అడుగుల వరకు, పెద్దలకు 6 నుంచి 8 అడుగుల వరకు పూల్స్ నిర్మిస్తారు. ఇవి పర్యాటకాభివృద్ధికి కూడా దోహదపడతాయని అధికారులు భావిస్తున్నారు. ఈ ప్రయోగం విజయవంతమైతే లాసన్సబే, సాగర్నగర్, రుషికొండ, మంగమారిపేట, భీమిలి బీచ్ లలో సీ పూల్స్ నిర్మించాలని అధికారులు భావిస్తున్నారు.