ఇప్పటికే తన రెడ్ మి మొబైల్ ఫోన్ లతో స్మార్ట్ ఫోన్ ల అమ్మకాలలో ముందంజలో ఉన్న షియోమీ సంస్థ భారత మార్కెట్లో తన మొబైల్ అమ్మకాలను మరింత పెంచుకునేందుకు సరికొత్త మొబైల్ ఎక్స్ఛేంజ్ పథకాన్ని ప్రవేశపెట్టింది. తమవద్దనున్న పాత ఫోన్ ని స్టోర్ లో ఇచ్చేసి కొత్త ఎంఐ స్మార్ట్ ఫోన్ ని వినియఁగదారులు తీసుకెళ్లే విధానాన్ని అమలుచేస్తుంది. ఇందుకోసం న్యూ దిల్లీకి చెందిన క్యాషిఫై సంస్థతో జతకట్టింది. వినియోగదారులు తమ పాత స్మార్ట్ఫోన్ను ఎక్స్ఛేంజ్ చేసుకుని సరికొత్త ఎంఐ మొబైల్ను సొంతం చేసుకోవచ్చు.
మార్చుకోవడం ఎలా..?
తమ పాత ఫోన్ను మార్చుకోవాలనుకుంటున్న వారు తమకు దగ్గర్లోని ఎంఐ హోమ్ స్టోర్కు వెళ్లాల్సి ఉంటుంది. అక్కడ క్యాషిపై టీం పాత ఫోనుకు ఎంత ధర వస్తుందో చెబుతారు. క్యాషిఫై యాప్ ద్వారా పాత ఫోను ధరను లెక్కిస్తారు. దీన్ని మినహాయించి కొత్త ఫోనుకు డబ్బులు చెల్లిస్తే సరిపోతుంది. పాత మొబైల్కు ఎంత ధర వస్తుందనేది క్యాషిఫై వెబ్సైట్లో ముందే చూసుకునే వెసులుబాటు కూడా ఉంది.
క్యాషిఫై సిబ్బంది మీరున్న దగ్గరికే వచ్చి సదరు పాత మొబైల్ను తీసుకెళ్లే ఆప్షన్ కూడా ఉంది. అయితే ఈ విధానంలో తొలుత ఎంఐ హోమ్ వద్ద మీ కొత్త మొబైల్కు పూర్తి డబ్బు చెల్లించాల్సి ఉంటుంది. తర్వాత క్యాషిఫై మీ పాత ఫోను డబ్బులను అందిస్తుంది. ‘క్యాషిఫైతో కలిసి మేము ఈ కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించాం. వినియోగదారులు తమ పాత ఫోన్ను ఇచ్చేసి కొత్త షియోమీ స్మార్ట్ఫోన్ను సొంతం చేసుకోవచ్చు. దీనికి చేయాల్సిందల్లా వారు తమ పాత ఫోన్ను ఎంఐ హోమ్కు తీసుకుని రావడమే’ అని షియోమీ సంస్థ ఓ ప్రకటనలో పేర్కొంది.