చిన్న జ్వరం వచ్చి సరిగా పరీక్ష రాయకపోయినా, పరీక్ష లో ఒక్క మార్కు తగ్గినా జీవితంలో అన్నీ కోల్పోయినట్టు ఇంక జీవితమే లేదన్నట్టు తెగ బాధ పడే వాళ్ళున్నారు. ఇక జీవితం లో ఏమీ సాధించలేమని కుంగి పోయే వారూ ఉన్నారు. ఒకసారి ఫెయిల్ అయితే తమని తాము శిక్షించుకొని, తల్లిదండ్రుల్నీ బాధ పెట్టే వాళ్ళూ ఉన్నారు. ఇలాంటి వాళ్ళందరికీ రాజస్థాన్ కి చెందిన ఉమల్ ఖేర్ జీవితం ఏంతో ఆదర్శం. నిజంగా ఉమ్మల్ ఖేర్ గురించి తెలుసుకుంటేనే ఏదో స్పూర్తి కలుగుతుంది. ఒంట్లో లక్ష వాట్ల ఉత్తేజం, శక్తి, లక్షం పట్ల క్రమశిక్షణ కలిగిస్తుంది.
ఉమల్ ఖేర్ బాల్యంలోనే అనారోగ్యం పాలైంది. ఎముకల వ్యాధి, పూరిగుడిసేలో కటిక పేదరికంతో బతికే జీవితం. బతకడం కోసం కుటుంబమంతా వలసల పాలు. అయినా ఆమె ఎప్పుడూ పుస్తకాల పురుగే. చదువు చెప్పించలేక, ట్రీట్మెంట్ ఇప్పించలేక నిస్సహాయంతో, కోపంతో పదమూడేళ్లకే తల్లిదండ్రులు కూడా ఉమల్ ఖేర్ ని వదిలేశారు. ఇన్ని కష్టాలు, బాధలు అనుభవించిన ఏ అమ్మాయయినా ఏమవుతుంది? కానీ, ఉమల్ ఖేర్ ఏడుస్తూ కూర్చోలేదు.కుంగిపోలేదు.ఆత్మహత్యా ప్రయత్నాలు చేయలేదు. పదిమందికి ఆదర్శంగా నిలిచేలా, వదిలేసినా కుటుంబమే దరికి చేరేలా.. కష్టపడి,పోరాడి, సివిల్స్ లో 420వ ర్యాంకు సాధించింది. త్వరలోనే ఐఏఎస్ కాబోతోంది.
ఉమల్ తల్లిదండ్రులది రాజస్థాన్. ఉమల్ తో పాటూ ఇద్దరు మగ పిల్లలు వారి సంతానం. అప్పటికే నడవలేని స్థితిలో ఉన్న 5 ఏళ్ల ఉమల్ తో పాటు కుటుంబం డిల్లీకి వలస వెళ్ళింది. హజరత్ నిజాముద్దీన్లోని ఒక మురికివాడలో చిన్న గుడిసెలో జీవనం మొదలెట్టారు. ఉమల్ తల్లి కూలీగా పని చేస్తే, తండ్రి బట్టలు అమ్మేవాడు. అనారోగ్యం తో ఉన్న ఉమల్ ని, దగ్గర్లోని పండిట్ దీనదయాళ్ ఇనిస్టిట్యూట్ ఫర్ ఫిజికల్లీ హ్యాండీక్యాప్డ్ సెంటర్ లో చేర్చారు. ఐదో క్లాసు దాకా అక్కడే చదివిన ఉమ్మల్.. అమర్జ్యోతి చారిటబుల్ ట్రస్టులో ఎనిమిదో తరగతి దాకా చదువుకుంది. అప్పటికే ఎముకల జబ్బు వల్ల నాలుగుసార్లు ఆపరేషన్లు చేయించుకుంది. అయినా కూడా అర్వాచిన్ భారతీ భవన్ స్కూల్ లో చేరతానని తల్లిదండ్రులని అడిగింది. కానీ వద్దన్నారు. అసలే చాలీ చాలని జీతం పైగా ఉమ్మల్ వైద్యానికే మూడొంతుల జీతం అయిపోయేది. ఇంకేం చదవడం వద్దు, ఇంట్లో ఉండి కుట్టుపని నేర్చుకో అని ఖరాఖండిగా చెప్పేశారు. స్కూల్ వాళ్ళే స్కాలర్షిప్ కూడా ఇస్తారని చెప్పినా కూడా వాళ్లు వినిపించుకోలేదు. ఉమల్ కు మాత్రం ఎలాగైనా బాగా చదువు కోవాలన్న ఆశ.
అయినా చదువుకుంటా అని రోజూ నస పెడుతుంటే ఇంక భరించలేం, ఇంటి నుంచి వెళ్లిపో అన్నారు తల్లిదండ్రులు. ఇలాగైనా ఇంట్లో పడి ఉంటుందని వాళ్ళ ఆలోచన. కానీ ఉమల్ చదవాలనే నిశ్చయించుకుంది. ఇంట్లోంచి బయటకొచ్చింది. స్నేహితురాళ్ళు, తెల్సినవాళ్ళ సాయంతో త్రిలోకపురి అనే మురికివాడలో ఓ చిన్న గుడిసెకు మకాం మార్చింది. ఒంటరి పోరాటానికి రెడీ అయింది. తొమ్మిదో తరగతిలో చదివేందుకు స్కాలర్షిప్ ఇస్తారు కానీ కొత్త బడిలో చేరేందుకు ఫీజులెలా? అర్థం కాని పరిస్థితి. అయితే అంతకుముందు చదివిన అమర్జ్యోతి చారిటబుల్ ట్రస్టుని ఆశ్రయించింది. వాళ్లు పదో తరగతి దాకా అయ్యే ఖర్చు భరించడానికి ముందుకొచ్చారు.
ఇక ఒంటరి పోరాటం ప్రారంబించింది. ట్యూషన్లు చెప్పడం మొదలుపెట్టింది ఉమల్. మెల్లిగా ట్యూషన్ పిల్లలు బాగా పెరిగారు. సాయంత్రం ఆరు నుంచి రాత్రి పదకొండుదాకా ట్యూషన్ చెప్పేది. అందరూ కూలీల పిల్లలే కాబట్టి నెలకి యాభై నుంచి వంద రూపాయలే తీసుకునేది. ఈ ట్యూషన్ డబ్బులతోనే ఇంటర్ కంప్లీట్ చేసింది. అలా ఇలా కాదు. ఏకంగా 91 శాతం మార్కులతో. దాంతో గార్గి కాలేజీలో సీటు సాధించింది. కానీ మళ్ళీ ఫీజుల ఇబ్బంది. కానీ రకరకాల పోటీల్లో పాల్గొని, అన్నిట్లోనూ మొదటి బహుమతికోట్టేసి.. డిగ్రీ కూడా మంచి మార్కులతో పాసయింది.
తర్వాత జవహర్లాల్ జాతీయ విశ్వవిద్యాలయంలో ఇంటర్నేషనల్ స్టడీస్ విభాగంలో పీజీ సీటు సాధించింది. అదీ ఫ్రీ సీటు. ఎలాంటి ట్యూషన్ ఫీజు ఉండదు. పైగా నెలకి రెండువేల రూపాయల స్టైపండ్. పీజీ చేస్తుండగా ఓ ప్రమాదం జరగటం వల్ల దాదాపు ఏడాది పాటు వీల్ చైర్ కే పరిమితం అయింది. అయినా.. పట్టు వీడలేదు, పట్టుదలతో పీజీ పూర్తి చేసింది. తరవాత 2013లో నెలకు పాతికవేల రూపాయల జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ అందుకుంది. ఈ మొత్తం.. ఉమల్ కుటుంబం మూడేళ్ల ఆదాయం. ఈ డబ్బు తో కుటుంబానికి కూడా ఆసరా అయ్యింది. ఇంకా వెంటనే ఉద్యోగం అని కాకుండా సివిల్స్ లక్ష్యంగా పెట్టుకుంది. ఒక వైపు అనారోగ్యం పీడిస్తూనే ఉంది. ఎముకల జబ్బు వల్ల దాదాపు 16 ఫ్రాక్చర్లయ్యాయి. అయినా సరే ఎక్కడా బెదరలేదు. విధి ఆడే వింత నాటకానికి లొంగలేదు. సివిల్స్ రాసి 420వ ర్యాంకు తెచ్చుకుంది. ఇక ఉమల్ ఖేర్ సాధారణ ఉమల్ కాదు.. ఉమల్ ఖేర్ ఐఏఎస్.. అయితే కనీసం ఐఏఎస్ అంటే ఏంటో కూడా వారి పేరెంట్స్ కి తెలీకపోవడం నిజంగా విడ్డూరం.