భారతదేశంపై అతడికి ఉన్న అభిమానం, జంతులపై అతనికి ఉన్న ప్రేమ ల ముందు సుమారు 12 వేల కిలో మీటర్ల దూరం కూడా తక్కువగానే అనిపించింది.ఖండాలని దాటించి భారత దేశపు మట్టి పై మరో సారి అతన్ని అడుగు పెట్టించంది. అసహనంతో ఊగిపోయి శక్తిమాన్ అశ్వం కాలును స్వదేశీయుడు (బీజేపీ ఎంఎల్ఏ) విరగ్గొడితే… పరిమళించిన మానవత్వంతో ఓ విదేశీయుడు… ఆ మూగ జీవానికి కృత్రిమ అవయవాన్ని ఇచ్చేందుకు తన సొంత ఖర్చులతో అమెరికా నుంచి డెహ్రాడూన్కు వచ్చాడు. ఉత్తరాఖండ్ డెహ్రాడూన్లోని ఒక పోలీసు గుర్రానికి కృతిమ కాలు ఆవసరం అని తెలియగానే 54 ఏళ్ల వయసులోనూ సొంత ఖర్చులతో భారత్కు కృత్రిమ కాలు తీసుకొచ్చారు టిమ్ అనే అమెరికన్.
శక్తిమాన్ గుర్తుంది కదా… అదే బీజేపీ ఎమ్మెల్యే గణేశ్ జోషి దాడిలో గాయపడిన పోలీసు అశ్వవం. గత 14న బీజేపీ నిరసన ప్రదర్శన సందర్భంగా ఎమ్మెల్యే గుర్రాన్ని లాఠీతో విపరీతంగా కొట్టారు. బీజేవైఎం కార్యకర్త ఒకరు దాని కళ్లాలు పట్టిలాగడంతో అది కిందపడి తీవ్రగాయాల పాలైం ది.
దాని వెనుకకాళ్లు తీవ్రంగా దెబ్బతిన్నాయి. రెండు కాళ్లల్లోనూ ఎముకలు విరిగిపోయాయి. అందులో ఎడమకాలికి ఇన్ఫెక్షన్ సోకడంతో గురువారం రాత్రి డాక్టర్లు దానిని తొలగించారు. ఈ నెల 9న దానికి కృత్రిమ కాలును అమర్చారు. అయితే దీని వెనక ఆసక్తికరమైన విషయం ఉంది. శక్తిమాన్ కాలు కోల్పోయిన తర్వాత.. దాని ఆపరేషన్లో తలమునకలయ్యారు డాక్టర్లు. శక్తిమాన్కి చికిత్స చేస్తున్న డాక్టర్ జామీ వాఘన్… ఫేస్ బుక్ లో ఓ పోస్టు పెట్టారు. అమెరికా నుంచి వచ్చే వాళ్లెవరైనా శక్తిమాన్ కోసం కృత్రిమ కాలు తీసుకొచ్చి సాయం చేయాలని కోరారు. కొరియర్లో అయితే 8 నుంచి 10 రోజులు పడుతుంది కాబట్టి త్వరగా తీసుకురావాలని పోస్టులో రాశారు. అది చూసిన వెంటనే అమెరికాలోని కెంటకీకి చెందిన టిమ్ మహోని స్పందించారు. టిమ్ కెంటకీ లోనే ఉండే బ్యాంకు మాజీ ఉద్యోగి. వర్జీనియాలోని కృత్రిమ అవయవాల తయారీ కేంద్రం నుంచి శక్తిమాన్కు అవసరమైన కృత్రిమకాలు తీసుకుని హుటాహుటిన భారత్ చేరుకున్నారు టిమ్. వీటన్నింటి ఖర్చులు టిమ్ సొంతంగా భరించడం విశేషం. ఆ మర్నాడే శక్తిమాన్కు ఆ కృత్రిమ కాలును అమర్చారు. వెంటనే స్పందించి స్వచ్ఛందంగా సహకరించిన టిమ్కి అధికారులు కృతజ్ఞతలు తెలిపారు.
తనకు భారత్, ఇక్కడి సంస్కృతి, ప్రజలు, జంతువుల పట్ల వారి ప్రేమ… ఇవన్నీ ఎంతగానో నచ్చుతాయని, ఈ దేశం వచ్చిన ప్రతిసారీ మంచి అనుభూతులను వెంట తీసుకెళ్తానని, ఇది మాత్రం తనకు చిరస్మరణీయ పర్యటనగా మిగిలిపోతుందన్నారు టిమ్.