వందల సంవత్సరాలుగా పిల్లల హక్కుల కోసం పోరాటం జరుగుతూనే ఉంది.బాల్య వివాహాలని ఆపేందుకు చట్టాలూ,అవగాహనా సదస్సులూ ఇలా ఎన్నో ప్రభుత్వమూ,స్వచ్చంద సంస్థల ప్రయత్నాలూ జరుగుగుతూనే ఉన్నయి. అయినా ఈ దురాచారం మాత్రం ఆ పిల్లలని వదలటం లేదు. దేశంలో ఏటా నిర్ణీత వయసులోపు పిల్ల వివాహాలు వందల సంఖ్యలో జరుగుతూనే ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో కొందరి తల్లిదండ్రుల భావన. వయసు పరిపక్వత లేని పెళ్లి వల్ల ఎన్నో అనర్థాలు ఎదురవుతాయి. బాలికలు ఆరోగ్యపరంగా, శారీరకంగా ఇబ్బందులు ఎదుర్కొంటారు. మాతా శిశు మరణాలకూ ఆస్కారముంది. యువతీయువకులకు యుక్త వయసు వచ్చాకే పెళ్లి చేయడం అన్ని విధాలా శ్రేయస్కరం.. ఇవీ వైద్యుల సూచనలు. అమ్మాయికి 18.. అబ్బాయికి 21 వయస్సు నిండకుండా పెళ్లి చేయడం నేరం. ఇలాంటి వివాహాలను ప్రోత్సహించినా.. చేయించినా.. అలాంటి వారిపై చట్టప్రకారం చర్యలు తప్పవు. ఇవీ ప్రభుత్వ హెచ్చరికలు. అయినా… పసివాళ్ళ కు ఈ చెర తప్పటం లేదు…
బాల్య వివాహాల నిరోధక చట్టం 1929లో అమలులోకి వచ్చింది. 2006లో ఈ చట్టాన్ని మరింత పటిష్టం చేసి రెండేళ్ల జైలు శిక్షను చేర్చారు. బాలికను పెళ్లి చేసుకున్న వ్యక్తితో పాటు ఇరువర్గాల తల్లిదండ్రులు, పురోహితులు, మత, కుల పెద్దలు, బంధుమిత్రులు, ఫొటోగ్రాఫర్, వీడియోగ్రాఫర్, సామగ్రి సరఫరా చేసిన టెంటు వారు, పెళ్లికి హాజరైన వారిపై కూడా కేసులు నమోదు చేసి అరెస్ట్ చేసే అవకాశం ఉంది. గ్రామ స్థాయిలో వీఆర్ఓ, మండల స్థాయిలో అంగన్వాడీ సూపర్వైజర్, తహశీల్దార్, ఎంపీడీఓ, మూడు మండలాలకు ప్రాజెక్టు స్థాయిలో సీడీపీఓ, డివిజన్ స్థాయిలో ఆర్డీఓ, జిల్లా స్థాయి లో కలెక్టర్ బాల్య వివాహాల నిరోధక అధికారులుగా నియమితులయ్యారు. పెళ్లి జరిగిన రెండేళ్ల లోపు కేసు నమోదు చేయవచ్చు…
ఈ సమస్య అంతగా చదువుకోని గ్రామీణ ప్రాంతాలలోనే అని భ్రమ పడితే అది మీ అమాయకత్వమే.స్మార్ట్ సిటీ గా పిలిపించుకున్న విశాఖ పట్టణం లోనే మార్చి 2014 – ఏప్రిల్ 2015 మధ్య కాలంలో 59 బాల్య వివాహాలను అధికార యంత్రాంగం గుర్తించింది. అన్ని రాష్ట్రాల పరిస్ధితి ఒకటైతే..కేరళలో పరిస్ధితి మరోలా ఉంది. అన్ని రాష్ట్రాల కంటే చదువులో ముందుండే కేరళలోనూ బాల్య వివాహాలు ఎక్కువగానే జరుగుతున్నాయని,ఎంత చదువుకున్నా కొన్ని ఆచార సంప్రదాయాల పేరిట ఈ దారుణం జరుగుతూనే ఉందని యూనెసెఫ్ తేల్చింది.దేశంలో జరిగే బాల్య వివాహాల్లో 15% బాల్య వివాహాలు బీహార్ లోనే జరుగుతున్నాయై.
అయితే బీహార్ వంటి అక్షరాస్యత లేని రాష్ట్రాలే కాదు చదువులో ముందున్నా రాష్ట్రాలలోనూ,పట్టణాల్లోనూ పరిస్థితి అలానే ఉంది. ఈ మధ్య కాలంలో కేరళ రాష్ట్రంలో బాల్య వివాహాలు పెరుగుతన్నట్లు యూనెసెఫ్ ప్రకటించింది. చదువులు ఉన్నా..బాల్య వివాహాల పట్ల రాష్ట్రంలో అవగాహన లేదని కూడా యూనెసెఫ్ కు చెందిన అధికారి చెప్పారు. కొన్ని మతాల వల్ల కేరళ రాష్ట్రంలో ఇంకా బాల్య వివాహాలు జరుగుతున్నాయని..యూనెసెఫ్ సర్వేలో తేలింది. కేరళతో పాటు బీహార్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, జార్ఖండ్, వెస్ట్ బెంగాల్ రాష్ట్రాల్లోనూ బాల్యవివాహాలు రానూ రానూ తగ్గక పోగా ఏటా పెరుగుతున్నాయని అధికారులు తేల్చారు.శిశుమరణాల సంఖ్య పెరగటానికి ఇదీ ఒక కారణం అని ఎన్ని నివేదికలు చెప్తున్నా ప్రజల్లో అవగాహన పెంచటం లో ప్రభుత్వాలు విఫలం అవుతూనే ఉన్నాయి.