ఎవరికైన సహాయం చేయాలంటే కోట్ల డబ్బు ఉండాల్సిన అవసరం లేదు, చేయాలన్న సృహ ఉంటే చాలు అని నిరూపించింది మహారాష్ట్ర కి చెందిన జయంత్ భోలే కుటుంబం. ప్రక్క వారికి సాయం చేయాలని మనందరికి ఉంటుంది కాని భవిష్యత్తులో చేయోచ్చులే అని ఈరోజు మనం చేతులు కట్టుకొని కూర్చోని సమయం కొరకు ఎదురుచూస్తుంటాం. కాని జయంత్ భోలే ఫిబ్రవరి 11 న తన కుమారుడి వివాహ సందర్భంగా ఆడంభరాలకు పోకుండా పెళ్ళి ఖర్చులు తగ్గించి, త్రాగునీటి సమస్యతో బాధపడుతున్న మహారాష్ట్ర జల్గావ్ జిల్లాలో ని వార్ఖెడె గ్రామానికి శాశ్వతంగా సురక్షితమైన త్రాగు నీరు అందించే నీటి శుద్ధి యంత్రం(రివర్స్ ఓస్మోసిస్ యంత్రం)ను విరాళంగా ఇచ్చాడు.
ఆర్ట్ ఆఫ్ లివింగ్ శ్రీ శ్రీ రవి శంకర్ బోధనలను పాటించే జయంత్ భోలే కుటుంబం ఈ పెళ్ళికి ఒక్క రూపాయి కట్నం కూడా తీసుకోలేదు అంతే కాకుండా తమకు వీలైనంతగా ఇతరులకు సహాయం చేయాలని అమ్మాయి తరపు కుటుబం వారిని కూడా ఒప్పించారు. ఇలా ఇరు కుటుంబాలు కలిసి పెళ్ళి లో అనవసరం అనుకున్న అన్నింటిని తగ్గించి 1.7 లక్షలు జమ చేసారు. ఆ డబ్బుని వార్ఖెడె గ్రామంలో రివర్స్ ఓస్మోసిస్(RO) ప్లాంట్ పెట్టడానికి విరాళంగా ఇచ్చి తన ఔన్నత్యాన్ని చాటుకున్నారు.