ఐపీఎల్ అంటే మన దేశంలో జరిగే అతిపెద్ద క్రికెట్ పండుగ, పొట్టి క్రికెట్ లో అతిపెద్ద, అత్యంత జనాదరణ కలిగిన లీగ్ గా పేరొందిన ఐపీఎల్ ఈ సంవత్సరంలో పదో సీజన్లోకి అడుగుబెట్టబోతుంది, ఐపీఎల్ వల్ల ఎంతో మంది క్రికెట్ ఆటగాళ్లు వెలుగులోకి వచ్చారు, ఐపీఎల్ వేదికగా వాళ్ళ టాలెంట్ ని నిరూపించుకొని అంతర్జాతీయ స్థాయిలో పేరు పొందారు, ఎప్పటి లాగానే లీగ్లో ప్లేయర్ల కోసం తాజాగా వేలం నిర్వహించారు. ఈ క్రమంలో పలువురు విదేశీ క్రికెటర్లతోపాటు, భారత క్రికెటర్లు కూడా పెద్ద మొత్తాలకే ఆయా ఫ్రాంచైజీలకు అమ్ముడయ్యారు. ఈసారి కొంత మంది కుర్రాళ్ళని ఫ్రాంచైజీలన్ని పోటీపడి దక్కించుకున్నాయి, అంతర్జాతీయ క్రీడాకారులకంటే స్థానిక కుర్రాళ్ళని కొనడానికే ఎక్కువ ఆసక్తిని కనబరిచాయి.
హైదరాబాద్ కి చెందిన మహమ్మద్ సిరాజ్ అనే కుర్రాడిని సన్ రైజర్స్ హైదరాబాద్ టీమ్ కొనుక్కుంది, 20లక్షల బేస్ ప్రైస్ ఉన్న సిరాజ్ ను.. 2కోట్ల 60లక్షలకు కొనుగోలు చేసింది సన్ రైజర్స్. సిరాజ్ ది సాధారణ మధ్య తరగతి కుటుంబం, సిరాజ్ తండ్రి ఒక ఆటో డ్రైవర్, తండ్రి ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు, చిన్నప్పటి నుండి క్రికెట్ ఆడుతూ తన టాలెంట్ ని నమ్ముకుని మంచి ఫాస్ట్ బౌలర్ గా సిరాజ్ ఎదిగాడు, ఫస్ట్ క్లాస్ మ్యాచ్ లలో అత్యంత ప్రతిభ కనబరచడంతో సిరాజ్ ని దక్కించుకునేందుకు టీమ్ లన్ని పోటీ పడ్డాయి, తొలుత సిరాజ్ బేస్ రేట్ను రూ.20 లక్షలు మాత్రమే ఉంచగా, ప్రాంచైజీలు ఇతని పట్ల ఆసక్తిని చూపడంతో ఆ రేట్ కాస్తా రూ.2.60 కోట్లకు చేరింది. దీంతో అలా ఐపీఎల్లో సెలెక్ట్ అయ్యే సరికి ఇప్పుడు సిరాజ్ కుటుంబంలో ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. తన తండ్రి పడిన కష్టానికి, తాను చేసిన ప్రయత్నానికి మంచి ఫలితం దక్కింది అంటున్నాడు సిరాజ్.
రైల్వే కూలీ కొడుకు అయిన తమిళనాడుకు చెందిన నటరాజన్, జీవితంలో ఊహించని నజరానాను అందుకున్నాడు. వేలంలో 10 లక్షల రూపాయల బేస్ రేట్ దగ్గర ఉన్న ఈ ఫాస్ట్ బౌలర్ ను.. మూడు కోట్ల రూపాయలు ఖర్చు చేసి సొంతం చేసుకుంది కింగ్స్ ఎలవన్ పంజాబ్. ఈ ఏడాది ఐపీఎల్ లో అత్యధిక ధర పలికిన యువ దేశీయ ఆటగాడిగా నటరాజన్ రికార్డులకెక్కాడు. నటరాజన్ తండ్రి ఓ రైల్వే కూలి, తల్లి టీకొట్టు నిర్వహిస్తోంది. రూపాయి రూపాయి పోగేసి.. కుటుంబాన్ని నెట్టుకొస్తుండేవారు ఇద్దరు. తల్లిదండ్రుల కష్టం తెలిసిన నటరాజ్.. ఎప్పుడు ఆడంబరాలకు పోలేదు. ఉన్నదాంతోనే సర్దుకుపోతూ.. తన అభిమాన క్రికెట్ పై దృష్టిపెట్టాడు. 2015లో తొలిసారి రంజీలో అవకాశం దక్కించుకున్నాడు. మొన్నటి తమిళనాడు ప్రీమియర్ లీగ్ లో ఉత్తమ ప్రదర్శన కనబరిచి, ఐపీఎల్ ఫ్రాంచైజీల దృష్టిలో పడ్డాడు.