హైదరాబాద్ లో ఐటీ రంగం ఇంతలా వృద్ధి చెందడానికి మొదటి అడుగు చంద్రబాబు నాయుడే వేశారని, హైదరాబాద్లో ఐటీ పరిశ్రమ వేళ్లూనుకోనప్పుడు దాదాపు 17 ఏళ్ల క్రితం మైక్రోసాఫ్ట్ కేంద్రాన్ని ఇక్కడ ఏర్పాటు చేసేలా మైక్రోసాఫ్ట్ సృష్టికర్త బిల్ గేట్స్ ని చంద్రబాబు ఒప్పించగలిగారని ఆయన చెప్పారు, టెక్ మహీంద్రా సంస్థ వార్షికోత్సవంలో పాల్గొన్న కేటీఆర్ మాట్లాడుతూ..’మైక్రోసాఫ్ట్ కేంద్రం ఇక్కడ ఉండడం మా గొప్పగా చెప్పుకోవడం లేదు. నిజానికి ఈ ఘనత చంద్రబాబునాయుడుదే. మైక్రోసాఫ్ట్ కేంద్రాన్ని తీసుకురావడంలో ఆయన తన సర్వశక్తులూ ఒడ్డారు’ అని కేటీఆర్ చెప్పారు. టెక్ మహీంద్రా సీఈఓ సి.పి.గుర్నానీ అడిగిన ఒక ప్రశ్నకు ఐటీ మంత్రి పైవిధంగా స్పందించారు. నిపుణుల లభ్యత కారణంగా గూగూల్, మైక్రోసాఫ్ట్ తదితర అతిపెద్ద టెక్నాలజీ కంపెనీలు హైదరాబాద్లో కేంద్రాలను ఏర్పాటు చేశాయన్నారు.
రానున్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పురోభివృద్ధి చెందుతుందని, పేరు ప్రఖ్యాతులు సంపాదించగలదని కేటీఆర్ ఆకాంక్షించారు. నగరాలను ఒక్క రోజులో నిర్మించలేమన్నారు. హైదరాబాద్ను ఒక్క రోజులో అభివృద్ధి చేయలేదని, ఈ నగరానికి 450 సంవత్సరాల చరిత్ర ఉందని మంత్రి చెప్పారు.