చదువులో అత్యుత్తమ ప్రతిభ కనబరిచే ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కోసం సరికొత్త పథకాన్ని తీసుకువచ్చింది మోడీ ప్రభుత్వం, చదువులో ప్రతిభ కనపరిచే విద్యార్థులు ఉన్నత విద్య కోసం విదేశాలకి వెళ్లకుండా.. మనదేశంలో ఉన్నత విద్య అభ్యసించేలా ప్రోత్సహించి దేశీయంగానే మానవ వనరులను అభివృద్ధి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందులో భాగంగా ప్రధానమంత్రి రిసెర్చ్ ఫెలోషిప్స్(PMRF) స్కీంను ప్రకటించింది కేంద్రం. ఈ పథకం ద్వారా 2018-19 నుంచి ఏడేళ్లపాటు రూ.1,650 కోట్లను వెయ్యి మంది పీహెచ్డీ విద్యార్థుల కోసం ప్రతి ఏడాది ఖర్చు చేయనుంది.
ఈ స్కాలర్ షిప్ పథకంలో దేశంలో అత్యుత్తమ విద్యాలయాలు అయిన IISC, IIT, NIT, IISER, IIIT కాలేజీలలో బీటెక్ పూర్తి చేసిన స్టూడెంట్స్, ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ , ఇంటిగ్రేటెడ్ ఎంటెక్, సైన్స్ అండ్ టెక్నాలజీలో ఎమ్మెస్సీ చేస్తున్న స్టూడెంట్స్ కి దేశంలోనే అత్యుత్తమ విద్యాసంస్థలైన ఐఐటీలు, ఐఐఎస్లో పీహెచ్డీ చేసేందుకు అవకాశం కల్పించనున్నారు. అర్హత కలిగిన విద్యార్థుల నుంచి తుది జాబితాను ఎంపిక చేస్తారు. వీరందరూ మొదటి రెండు సంవత్సరాలు నెలకు రూ.70వేలు, మూడో ఏడాది రూ.75వేలు, నాలుగు, ఐదో సంవత్సరం రూ.80వేల స్కాలర్షిప్ అందుకోనున్నారు. ఉన్నత విద్యాసంస్థల్లో పరిశోధనా సౌకర్యాలు మెరుగుపరచడంతో పాటు స్కాలర్షిప్లు అందిస్తున్నామని.. ఈ పథకానికి కేబినెట్ కూడా ఆమోదం తెలిపిందని కేంద్ర మానవ వనరులశాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ తెలిపారు. ఉన్నత చదువులు చదువుతూ పరిశోధనలు చేయాలనుకునే ఇంజనీరింగ్ విద్యార్థులకి ఈ పథకం ఎంతగానే ఉపయోగపడుతుంది.