మహేంద్ర సింగ్ ధోని మైదానంలో ఎంత కూల్ గా ఉంటాడో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు, మ్యాచ్ ఎంతో ఉత్కంఠగా ఉన్నప్పటికీ ధోని మాత్రం ప్రశాంతంగా ఉంటూ జట్టును ముందుండి నడిపించేవాడు. ప్రతిసారి బౌలర్లకు తగిన సూచనలిస్తూ.. ఫీల్డర్లను సరైన ప్రదేశంలో సెట్ చేస్తూ ఎంతో కూల్గా మ్యాచ్ అంచనా వేస్తూ ముందుకు సాగుతుండేవాడు. అంత ప్రశాంతంగా ఉండే ధోనీ.. ఒకసారి చైనామన్ బౌలర్ కులదీప్యాదవ్పై ఆగ్రహాన్ని వ్యక్తం చేశాడట.
ఇటీవల ఓ షోకు హాజరైన టీంఇండియా స్పిన్నర్లు కులదీప్యాదవ్, చాహల్.. ధోనీతో వారికున్న అనుభవాన్ని పంచుకున్నారు. వికెట్ల వెనుక ఉండి తమ సగం పనిని ధోనీనే పూర్తి చేసే వాడని ఇరువురూ చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో ధోనీ తనపై ఒకసారి కోపాన్ని కూడా ప్రదర్శించినట్లు కులదీప్యాదవ్ పేర్కొన్నాడు. ‘అది ఇండోర్ వేదికగా శ్రీలంకతో టీ20 మ్యాచ్. ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ 260పరుగులు చేసి లంక ముందు భారీ లక్ష్యాన్ని ఉంచింది. అనంతరం ఛేదనకు దిగిన లంక బ్యాట్స్మెన్ కూడా సులభంగా పరుగులు రాబడుతున్నారు. ఎప్పటిలాగే ధోనీ ఈ మ్యాచ్లోనూ బంతిని బ్యాట్స్మెన్కు దూరంగా వేయమంటూ బౌలర్లకు సలహాలివ్వసాగాడు. ఆ సమయానికి నేను(కులదీప్) బంతి అందుకున్నాను. క్రీజులో ఉన్న బ్యాట్స్మెన్ నా బంతులను సులభంగా ఎదుర్కొంటూ బౌండరీలు బాదుతున్నారు. వెంటనే ధోనీ.. నన్ను ఫీల్డ్ మార్చుకొని బౌలింగ్ చేయమన్నాడు. దానికి సమాధానంగా.. మరేం ఫర్వాలేదు. అంత బాగానే ఉందన్నాను. దీంతో ఒక్కసారిగా ఆవేశానికి గురైన ధోనీ..300మ్యాచ్లాడాను. నేనేమైనా పిచ్చోడినా? అంటూ నాపై ఆగ్రహాం వ్యక్తం చేశాడు. ఆ తర్వాత ధోనీ చెప్పినట్లుగానే బౌలింగ్ చేసి వికెట్ తీశాను. అప్పుడు ధోనీ నా వద్దకు వచ్చి ఇదే కదా నేను చెప్తుంది అంటూ.. దగ్గరికొచ్చి అన్నట్లు’ కులదీప్ యాదవ్ ఆసక్తికర విషయాన్ని చెప్పాడు.