బ్యాంకు ఖాతాదారులందరూ వెంటనే ఆధార్ కార్డు నంబరుని తమ అన్నిఖాతాలతో అనుసంధానం చేయాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే గ్యాసు, సబ్సిడీలు, ఉపకార వేతనాలు.. అన్నింటికీ ఆధార్ తప్పనిసరి అంటుండడం తెలిసిందే. ఇక బ్యాంకు అకౌంట్లన్నింటికీ కూడా ఆధార్ నంబర్ ని డిసెంబర్ 31 లోపు జత చేయాల్సిందేనని కేంద్ర రెవెన్యూ శాఖ ఒక అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఇందు నిమిత్తం కొన్ని సవరణలు కూడా చేసింది. దీనివల్ల నల్లధనం, అక్రమ నగదు లావాదేవీలను కొంతమేరకు అరికట్టవచ్చు.
ఇప్పటికే కొంతమంది దొడ్డిదారిన రెండు, మూడు పాన్ బుక్ లు తీసుకొని, పన్నుకట్టకుండా ఎగవేస్తున్నారని, ఇలాంటి అక్రమాలన్నీ అరికట్టడానికే పాన్, ఆధార్లను తప్పనిసరి చేసింది ప్రభుత్వం. ఇక నుంచీ బ్యాంకు ఖాతా తీసుకున్నపుడే ఆధార్ నంబర్ ని పేర్కొనాలి. వ్యక్తులు, కంపెనీలు, భాగస్వామ్య సంస్థలు ఎవరైనా 50 వేల రూపాయలు అంతకన్నా ఎక్కువ డబ్బుతో లావాదేవీలు జరిపినప్పుడు కూడా కచ్చితంగా ఆధార్, పాన్ నంబర్లను తెలపాల్సి ఉంటుంది. పాన్ నెంబరు లేని వారు సమర్పించే ఫారం-60 పైన కూడా ఆధార్ నెంబరు రాయాల్సిందే. ఈ నిబంధనలన్నీజూన్ ఒకటో తేదీ నుంచే అమల్లోకి వచ్చినట్టుగా కేంద్ర రెవెన్యూ శాఖ పేర్కొంది.
ఇప్పటికే ఖాతాలు ఉన్నవారంతా డిసెంబరు 31లోగా ఆధార్, పాన్లను సమర్పించాలి. ఒకవేళ ఆధార్ లేకుంటే దరఖాస్తు చేసుకుని, దరఖాస్తు చేసిన ఆధారాలను సమర్పించాలి. తర్వాత ఆరు నెలల్లోగా ఆధార్ సంఖ్యను అనుసంధానం చేస్కోవాలి. అలాగే ప్రస్తుతం ఉన్న అన్ని బ్యాంకు ఖాతాలకీ డిసెంబరు 31లోగా ఆధార్ నంబరుని జత చెయ్యాలి. ఆధార్ నెంబర్ అనుసంధానం చేయకపోతే ఆ ఖాతాలను నిలిపివేస్తామని ప్రకటించారు . కాబట్టి వెంటనే మన ఖాతాలకు ఆధార్ నంబర్ ని జత చేసి మంచి పౌరులమని నిరూపించుకుందాం.