Home / Inspiring Stories / ప్రభుత్వ ఉద్యోగం కోసం 13 ఏళ్ల పోరాటం చేసి 48 యేళ్ళ వయసులో విజయం సాధించాడు.

ప్రభుత్వ ఉద్యోగం కోసం 13 ఏళ్ల పోరాటం చేసి 48 యేళ్ళ వయసులో విజయం సాధించాడు.

Author:

ప్రభుత్వ ఉద్యోగం చేయాలనేది అతని కల. తన కల సాకారం అయ్యేందుకు అహర్నిశలు కష్టపడి చదివాడు. ఇంతలోనే కుటుంబ పరిస్థితుల వల్ల చిన్న వయసులోనే పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. ఆ పెళ్లే అతడికి అవరోధంగా మారింది. పరీక్ష పాసయ్యి ఉద్యోగానికి అర్హత సాధించినా సరే నీకీ ఉద్యోగం ఇవ్వము పోమ్మన్నారు అధికారులు. ఎందుకని ప్రశ్నిస్తే చట్ట ప్రకారం పురుషుడి వివాహ వయసు 21 ఏళ్లు. ఆ వయసు కంటే ఆరు నెలలు ముందుగానే వివాహం చేసుకున్నాడనే కారణంతో అతడికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వలేదు. అయితే పెళ్లి వెనుక తన తప్పు లేదంటూ న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు. 13ఏళ్ల పాటు న్యాయపోరాటం చేసి.. ఎట్టకేలకు 48ఏళ్ల వయసులో ప్రభుత్వ ఉద్యోగం సాధించాడు. అతడెవరో? పోయిన ఉద్యోగాన్ని ఎలా తిరిగిపొందాడో ఇప్పుడు తెలుసుకుందాం.

man fought 13 years for job

గ్వాలియర్‌కు చెందిన అజయ్‌ కుమార్‌ కు చిన్నప్పటి నుండి ప్రభుత్వ ఉద్యోగి అవ్వాలనేది ఆశ. అందులోనూ అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్‌ అవ్వాలని కోరిక. బాగా కష్టపడి చదివేవాడు. అన్నీ.. బాగానే జరుగుతున్నసమయంలో, కుటుంబసభ్యులు మాత్రం పెళ్లి చేసుకోవాలని పట్టుబట్టారు. దీంతో, తనకు 20ఏళ్ల ఆరు నెలల వయసులో అజయ్‌ వివాహం చేసుకున్నారు. పెళ్లి తర్వాత కుటుంబ పరిస్థితుల వల్ల ఓ ప్రయివేటు సంస్థలో ఉపాధ్యాయుడిగా చేరారు. అయితే ఓ వైపు టీచర్‌గా పనిచేస్తూనే తన లక్ష్యం కోసం చదివాడు. అలా 2004లో తన 35వ ఏట మధ్యప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌(ఎంపీపీఎస్‌సీ) నిర్వహించిన అడ్మినిస్ట్రేటివ్‌ పరీక్షలో ఉత్తీర్ణత సాధించారు. ఇక తన కల నిజమైందని ఎంతో ఆశపడ్డారు. కానీ, కొద్ది రోజులకే ఆ ఆశలన్నీ అడియాశలయ్యాయి. రాత పరీక్షలో అర్హత సాధించినప్పటికీ ఇంటర్వ్యూ కోసం కాల్‌లెటర్‌ మాత్రం రాలేదు.

దీంతో, ఇండోర్‌లోని ఎంపీపీఎస్‌సీ కార్యాలయానికి వెళ్లి విచారించగా, అధికారులు చెప్పిన మాటలు విని షాక్‌కు గురయ్యారు. మధ్యప్రదేశ్‌ సివిల్‌ సర్వీసెస్‌ రూల్స్‌ ప్రకారం.. 21 సంవత్సరాల వయసు నిండకముందే పెళ్లి చేసుకున్నవారికి రాష్ట్ర సర్వీస్ కమిషన్ లో ఉద్యోగం ఇవ్వబోరని చెప్పారు. దీంతో షాక్ కు గురైన అజయ్, తనకు న్యాయం చేయాలంటూ కోర్టును ఆశ్రయించారు. హైకోర్టులో న్యాయం జరగకపోవడంతో సుప్రీంకోర్టుకు వెళ్లారు. దాదాపు 10ఏళ్ల నిరంతర పోరాటం చేసిన తర్వాత 2015లో అజయ్‌ ఈ కేసు గెలిచారు. బాల్యవివాహాల్లో వధువు, వరుడు బాధితులు అవుతారు కానీ నిందితులు అవబోరని, అన్ని అర్హతలు సాధించిన అజయ్‌కు వెంటనే ఉద్యోగం ఇవ్వాలని కోర్టు తీర్పునిచ్చింది.

అయితే సుప్రీం తీర్పును కూడా ఎంపీపీఎస్‌సీ లెక్కచేయలేదు. దీంతో.. అజయ్‌ మరోసారి కోర్టును ఆశ్రయించి మరో రెండేళ్ళు న్యాయ పోరాటం చేయాల్సి వచ్చింది. ఈ కేసులో మార్చి 2017లో విజయం సాధించారు. దీంతో దిగి వచ్చిన మధ్యప్రదేశ్ సర్వీస్ కమిషన్ అజయ్ కి ప్రత్యేక ఇంటర్వ్యూ నిర్వహించి, మే 9న ఫలితాలు వెల్లడించారు. అలా 48ఏళ్ల వయసులో అజయ్‌ తాను కలలుగన్న ప్రభుత్వ ఉద్యోగాన్ని సాధించారు.

(Visited 560 times, 1 visits today)