Home / Entertainment / ఆమ్యామ్య.. అప్పుం అప్పుం… ‘అల్లు’కున్న నవ్వుల జల్లు!

ఆమ్యామ్య.. అప్పుం అప్పుం… ‘అల్లు’కున్న నవ్వుల జల్లు!

Author:

అల్లు రామలింగయ్య పేరులోనే హాస్యం ఉంది. మాయబజార్ లో వేసిన పౌరాణికమైనా, అందాల రాముడు లో తీసేసిన తాసిల్దారు అయినా…. ముత్యాల ముగ్గు లో రావు గోపాలరావు తో కలిసి నవ్వులు పండించినా….శంకరాభరణంలో శంకర శాస్త్రి తో….. “శాస్త్రీ..చూడురా వాడు..కన్నడం లో ఎంత బాధ పడుతున్నాడో”……అంటూ వాపోయినా…..ఇచ్చిన పాత్రలో ఇమిడిపోవటం ఆయనకే చెల్లింది. ఆయన హాస్యం మూడు తరాల సినీ ప్రేక్షకులను అలరించింది. చారిత్రక కాలంలో కవిత్వంలో పలు ప్రక్రియలు చేపట్టి కవ్వించి , నవ్వించి ‘ వికటకవి గాతెనాలి రామలింగడు చరితార్థుడైతే , ఈనాటి సినీసీమలో అలాంటి స్థాన్నాన్ని పొందినవాడు అల్లు రామలింగయ్య.

పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు లో 1922 అక్టోబర్ 1న అల్లు రామలింగయ్య జన్మించాడు. చదువు పెద్దగా అబ్బలేదు. తన సహచరులతో కలసి ఆకతాయిగా తిరుగుతూ అందరినీ అనుకరిస్తూ నవ్వించేవాడు. ఇదే క్రమంతో నాటకాల్లో నటించాలనే ఉత్సాహం పెరిగింది. ఊళ్లోకి ఎవరు నాటకాల వాళ్ళు వచ్చినా వారి వెంటే తిరుగుతూ ఉండేవాడు. వాళ్లతో స్నేహం చేయడం, ఏదైనా చిన్న వేషం ఇమ్మని అడగడం నిత్యకృత్యంగా చేసుకున్నాడు. ఎట్టకేలకు భక్త ప్రహ్లాద నాటకంలో బృహస్పతి వేషం వేసే అవకాశం వచ్చింది. అదీ మూడు రూపాయలు ఎదురిచ్చేట్టుగా ఇంట్లో వాళ్ళకి తెలియకండా వేసాడు. నాటకానుభవం పెద్దగా లేకున్నా కొద్దిపాటి నటనావగాహనతో తన వేషం మెప్పించాడు. ఆ తరువాత ఇంట్లోంచి బియ్యం దొంగతనం చేసి వాటిని అమ్మి నాటక కాంట్రాక్టరుకు ఇచ్చాడు. అలా మొదలైనంది అల్లు  నట జీవితం.

అల్లు నాటకాల్లో నటిస్తూనే, తన సామాజిక బాధ్యతను గుర్తెరిగి గాంధీజీ పిలుపునందుకుని క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని జైలు కెళ్లాడు. జైలులో కూడా తోటివారిని పోగేసుకుని నాటకాలాడేవాడు. మరోవైపు అంటరానితనంపై ఉద్యమం నడిపాడు. అల్లు నాటాకాలు చూసిన గరికపాటి రాజారావు చిత్రసీమలో తొలిసారిగా 1952 లో పుట్టిల్లు చిత్రంలో కూడు-గుడ్డ శాస్త్రి తరహ పాత్రను అల్లుచే వేయించాడు. ఆ తరువాత హెచ్.ఎం.రెడ్డి ‘ వద్దంటే డబ్బు ‘ లో అవకాశం వచ్చింది. పుట్టిల్లు చిత్రం నిర్మాణకాలంలో తన భార్యా నలుగురు పిల్లలతో మదరాసుకు మకాం మార్చాడు. అల్లు తన కుటుంబాన్ని పోషించేందుకు చాలా కష్టాలు పడ్డాడు. మరోవైపు హొమియో వైద్యం నేర్చుకున్న అల్లు ఏమాత్రం తీరిక దొరికినా ఉచితవైద్య సేవలందించేవాడు.

అల్లు హాస్యపు జల్లునేకాదు కామెడీ విలనిజాన్ని కూడా బగా రక్తికట్టించాడు. అల్లు రామలింగయ్య నటించిన చిత్రాలలో ఆణిముత్యాలుగా చెప్పుకోదగ్గవి మూగమనసులు, దొంగరాముడు, మాయా బజార్,ముత్యాల ముగ్గు, మనవూరి పాండవులు, అందాలరాముడు,  శంకరాభరణం  మొదలైనవి వున్నాయి. ముత్యాలముగ్గు సినిమా చిత్రీకరణకు ముందు ఆయన కుమారుడు ఆకస్మికంగా మరణించినా బాధను మనసులో అణుచుకుని షూటింగ్ లో పాల్గొన్న గొప్ప నటుడు అల్లు. సుమారు 1030 సినిమాల్లో కామెడీ విలనీ, క్యారెక్టర్ పాత్రలు చేసాడు. 1116 చిత్రాల్లో నటించాలనే కోరిక ఆయనకు తీరలేదు. అల్లు  అభినయించిన చాల పాటలకు బాలు గళం సరిగా అమరి పోయింది. ‘ మనుషులంతా ఒక్కటే ‘ చిత్రంలో ‘ముత్యాలు వస్తావా అడిగిందీ ఇస్తావా అనే పాట అప్పట్లో హిట్.

తనే నిర్మాతగా గీతా ఆర్ట్స్ బానర్ ని నెలకొల్పి ‘ బంట్రోతు భార్య ‘ దేవుడే దిగివస్తే , బంగారు పతకం చిత్రాలను నిర్మించాడు. చాలాకాలం తర్వాత అల్లు 90 దశకంలో ‘ డబ్భు భలే జబ్బు‘ చిత్రం తీసాడు. రేలంగి, రమణారెడ్డి, కుటుంబరావు, బాలకృష్ణ వంటివారి కాలంతో మొదలు ఈతరం హాస్యనటులు వరకూ కొనసాగిన ఏకైక హాస్యనటుడు అల్లునే. ‘ ఆమ్యామ్య.. అప్పుం అప్పుం ‘ లాంటి ఊతపదాలు అతను సృష్టించినవే.

యాబైయేళ్లపాటు సినిమాల్లో నవ్వుతూ నవ్విస్తూ యావత్ తెలుగు ప్రజానీకాన్ని అలరించిన అల్లును వరించిన సన్మానాలు, గౌరవాలు,అవార్డులు అసంఖ్యాకమైనవి. భారత ప్రభుత్వం 1990 లో ‘ పద్మశ్రీ ‘ అవార్డు తో గౌరవించింది. రేలంగి తరువాత ‘ పద్మశ్రీ‘ అందుకున్న హాస్యనటుడు అల్లునే. 2001 వ సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అత్యున్నత ‘ రఘుపతి వెంకయ్య‘ అవార్డు ఇచ్చింది. పాలకొల్లులో ఆయన విగ్రహం నెలకొల్పారు. తన కోడుకు అల్లు అరవింద్ నిర్మాతగా స్థిరపడటం, అల్లుడు చిరంజీవి మెగాస్టార్ గా ఎదగడం, మనవుడు అల్లు అర్జున్ హీరోగా మారడం అయనకు జీవితం లో సంతృప్తినిచ్చిన అంశాలు. 2013లో భారత చలనచిత్ర పరిశ్రమ వందేళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంలో విడుదలయిన 50 తపాలాబిళ్ళలలో ఒకటి అల్లు రామలింగయ్య జ్ఞాపకార్థం విడుదలయింది.

 

(Visited 181 times, 1 visits today)