జపనీస్ ఎన్సెఫలైటిస్(మెదడు జ్వరం) అనే వ్యాధిని ప్రజలకు సోకకుండా పోరాడిన ఒకే ఒక్క ఐఏఎస్ అధికారి కథ ఇది. క్యూలెక్స్ అనే దోమ కుట్టడం ద్వారా ఈ జబ్బు వ్యాపిస్తుంది. ప్రతి ఏటా అస్సాం లో వర్శాకాలంలో ఈ దోమలు ఎక్కువవడం.. ఆ ప్రాంతాలన్నీ జబ్బుల బారిన పడడం సర్వ సాధారణం. జపనీస్ ఎన్సెఫలైటిస్ వల్ల మనిషి పూర్తిగా కదలలేని దుస్థితికి గురి కావాల్సి ఉంటుంది. కొన్ని సార్లు ప్రాణాపాయం కూడా ఉంటుంది. అయితే ఈ వ్యాధి సోకితే ఒక రకంగా జీవచ్చవం లా బతకాల్సిందే అని హెచ్చరిస్తున్నారు డాక్టర్లు. ఇంత ప్రమాదకరమైన ఈ జబ్బుకు సరైన చికిత్స కూడా లేకపోవడం తో ఇక్కడ ప్రభుత్వం ఏటా ముందస్తు వాక్సిన్లు పంపిణీ చేస్తుంది.
అయితే 2016 లో అస్సాం రాష్ట్ర వ్యాప్తంగా ఈ వ్యాక్సిన్ కొరత ఏర్పడింది. ఒక వైపు దోమ కాటు వల్ల జబ్బున పడుతున్న జనాలు, మరో వైపు వాక్సిన్ కొరత. దీంతో ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదిక మీద అనేక చోట్ల ఉచిత వాక్సిన్ శిబిరాలు ఏర్పాటు చేయడం మొదలెట్టింది. కానీ వాక్సిన్ కొరత వల్ల ప్రభుత్వం జస్ట్ స్టెరిలిటీ ఇంజక్షన్స్ ఇస్తుందనే పుకారు మొదలైంది. ముఖ్యంగా మైనారిటీస్ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ఈ పుకారు దావానలం లా వ్యాప్తి చెందింది. పైగా ఈ ఇంజక్షన్స్ వల్ల పిల్లలను కనే అవకాశం కోల్పోతారనే పుకారు కూడా జోడవడం తో, ప్రభుత్వం ఎంత ప్రయత్నించినప్పటికీ ప్రజలు వాక్సిన్లు వేసుకోవడానికి నిరాకరించారు. కొన్ని చోట్ల అయితే ఏకంగా దాడులు చేసి వాక్సిన్లని ధ్వంసం చేసారు.
ఎక్కువగా మైనారిటీస్ ఉండే అస్సాం అంతా కూడా ఈ వాక్సిన్ శిబిరాలని అడ్డుకోవడం, కొన్ని చోట్ల అధికారుల పై చేయి చేసుకోవడమూ జరిగాయి. అయితే దక్షిణ అస్సాం లోని సల్మారా జిలాలో మాత్రం ఒక 31 ఏళ్ల యువ ఐఏఎస్ అధికారి చొరవతో జనాల్లో, ముఖ్యంగా మైనారిటీస్ లో కొద్దిగా కదలిక వచ్చింది. అన్బ ముత్తన్ అనే ఈ ఐఏఎస్ అధికారి ముందు తన పని తీరు, వ్యక్తిత్వం తో మైనారిటీస్ మనసు దోచుకున్నాడు. తర్వాత అక్కడి లోకల్ మసిదుల్లోని ముల్లాలతో సమన్వయమై జనాలకు వాక్సిన్ పై అవగాహన పెంచాడు. అందరి ముందూ పబ్లిక్ గా ఆ వాక్సిన్ ని తనే వేయించుకోవడం ద్వారా అది అసలైన వాక్సినే అని ఎలాంటి దుష్పలితాలు ఉండవనే నమ్మకాన్నికలిగించాడు. రాత్రింభవల్లు కష్ట పడి మీటింగులు సదస్సులు ఏర్పాటు చేసి ప్రజల్లో అవగాహన కల్పించాడు. అందరికీ సరైన సమయం లో వాక్సిన్లు అందేలా, వారంతా సహకరించి వేయించు కునేలా చేశాడు.
రాష్ట్ర వ్యాప్తంగా అడ్డుకున్న వాక్సిన్ కార్యక్రమాన్ని ఈ ఒక్క ఐఏఎస్ అధికారి మాత్రం తన జిల్లా మొత్తం ఎలాంటి ఇబ్బంది లేకుండా జరిగిపోయేలా చేశాడు. ఇదంతా ఎలా సాధ్యం అయింది అంటే, తానూ గతం లో ఆర్మీ లో ఆరేళ్ళు పని చేసాను అని, సున్నిత ప్రాంతాల్లో, సున్నితమైన సమస్యలని, అక్కడ పుట్టే రూమర్లు, పుకారులని ఎదుర్కొనడం ఎలాగో ఆర్మీ లోనే తానూ తర్ఫీదు పొందానని చెప్పాడు. ఐఏఎస్ కావాలన్న లక్షం తోనే ఆర్మీ వదిలి సివిల్స్ కి ప్రిపెరయిన అన్బు ఇప్పుడు తన ప్రత్యేకమైన పని తీరు తో దేశ వ్యాప్తంగా ఫేమస్ అయ్యాడు. ఆయన అందరి బ్యురోక్రాట్స్ లా కాదు..ముందుండి అందరికీ మార్గదర్శం చేస్తాడు. అందరికీ ఎప్పుడూ అందుబాటులో ఉంటాడు. ఆఫీస్ కూడా నిరంతరం తెరిచే ఉంటుంది. ఎలాంటి సమస్య అయినా పరిష్కారం అయ్యేవరకు వదలదు అని కితాబిచ్చారు ఆల్ అస్సాం మైనారిటీ స్టూడెంట్ యూనియన్ జనరల్ సెక్రెటరి కరీం సర్కార్. ఇలాంటి నిస్వార్థ ఐఏఎస్ అధికారికి అలజడి హాట్స్ ఆఫ్ చెబుతోంది. ఇతన్ని చూసి మరింత మంది స్ఫూర్తి పొందాలనీ కోరుకుంటోంది.