ప్రాణాలు కాపాడే దేవుళ్ళే మనిషి మాంసంతో వ్యాపారం చేస్తున్నారు. కడుపునొప్పి అని ఆస్పత్రికి వచ్చిన చిన్నారులకు అపెండిసైటిస్ అంటూ అవసరం లేకున్నా ఆపరేషన్లు చేసి డబ్బులు దండుకున్న డాక్టర్ల తీరు ఆశ్చర్య పరిచింది. కరీంనగర్ జిల్లా కథలాపూర్ మండలంలో గత ఐదేళ్లలో ఏకంగా 300 మందికి అపెండిసైటిస్ శస్త్రచికిత్సలు జరగడం. ఇందులో 167 మంది విద్యార్థులే కావడం పరిస్థితికి అద్దం పడుతోంది. కడుపునొప్పని వస్తున్న బాధితులను కొందరు ఆర్ఎంపీలు, పీఎంపీలు కొన్ని ప్రైవేటు ఆసుపత్రులకు సిఫార్సు చేస్తున్నారు. అక్కడి వైద్యులు అపెండిసైటిస్ ఉంది.. అత్యవసరమంటూ ఆపరేషన్లు చేస్తున్నారు. ఒకే ఇంట్లో ఇద్దరు, ముగ్గురు పిల్లలకూ శస్త్రచికిత్సలు చేయడం పరిస్థితి తీవ్రతకు దర్పణం.
కథలాపూర్ మండలం గంభీర్పూర్ పాఠశాలలో విద్యార్థులు నిత్యం కడుపునొప్పి, కాళ్లు నొప్పులు అంటుండడంతో ప్రధానోపాధ్యాయుడు పి.లక్ష్మీనారాయణ ప్రభుత్వ వైద్యులతో పరీక్షలు చేయించారు. ఈ సందర్భంగా 43 మంది విద్యార్థులకు అపెండిసైటిస్ శస్త్రచికిత్సలు జరిగినట్లు తేలింది.ఒక దిన పత్రిక చేసిన ఒక ఆపరేషన్ లో ఒక్క తాండ్య్రాల గ్రామంలోనే 100 మంది పసివాళ్ళకు ఆపరేషన్ లు చేసినట్లు తెలిసింది. ఇందులో చాలా మంది నిరుపేదలు, నిరక్షరాస్యులే కావడం గమనార్హం. కథలాపూర్ మండలంలోని 5 ఉన్నత పాఠశాలల పరిధిలో గడిచిన ఐదేళ్లలోనెవ 167 మంది విద్యార్థులకు అపెండిసైటిస్ శస్త్రచికిత్సలు జరిగాయి.
సాధారణంగా అపెండిక్స్ లోపలిభాగంలో ఇన్ఫెక్షన్ కలగడం, మలం లేదా ఫారిన్బాడీ అడ్డుపడడం మూలంగా ఇది సంభవిస్తుంది. తీవ్రమైన కడుపునొప్పితో డాక్టర్ని సంప్రదించినప్పుడు ఆయన పేషెంట్ పరిస్థితి గురించి వివరాలు తెలుసుకొని పేషెంట్ యొక్క పల్స్రేటు, బి.పి., బ్రీతింగ్ రేట్ మరియు టెంపరేచర్ నోట్ చేస్తారు. రోగియొక్క శరీరాన్ని క్షుణ్ణంగా పరీక్షించి ముఖ్యంగా ఉదరభాగంలో నొప్పి ఉన్న ప్రాంతాన్ని పరీక్షించి ఒక అంచనాకు వస్తారు. తరువాత అవసరాన్ని బట్టి బ్లడ్ టెస్ట్ మరియు యూరిన్ టెస్ట్ చేయించమని సూచిస్తారు. కొన్ని సందర్భాలలో ఎక్స్రే, అల్ట్రాసౌండ్, లేదా సి.టి.స్కాన్ చేసి అపెండిసైటిస్ తీవ్రతని గుర్తిస్తారు. ఒక్కోసారి పై టెస్ట్లు చేసినా సరైన నిర్ధారణ జరగనప్పుడు లాప్రోస్కోపి విధానాన్ని ఎంచుకుంటారు. అయితే ఇన్ని పరీక్షల తరవాత జరగాల్సిన ఆపరేషన్లను కేవలం డబ్బుకోసం పసిపిల్లలకు చేసిన ఈ డాక్టర్లనూ,ఆసుపత్రులనూ ఏం చేయాలి?