ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తనమీద జరిగిన ఓ భీకర దాడి నుంచి త్రుటిలో తప్పించుకున్నారు. పంజాబ్ ఎన్నికల సందర్భంగా ఐదు రోజుల పర్యటన కోసం పంజాబ్ వెళ్లిన ఆయన కారుపై సాయుధులైన కొంతమంది మారణాయుధాలతో దాడికి దిగినట్టు తెలుస్తోంది. “గుర్తుతెలియని దుండగులు తన కారుపై దాడిచేశారని, బాదల్ వర్గీయులు ఇలాంటి భౌతికదాడులతో తమను అడ్డుకోలేరని కామెంట్ చేశారు. ఈ దాడి తమ స్ఫూర్తిని ఏమాత్రం దెబ్బతీయలేకపోయిందనీ” ఆయన ట్విటర్ లో పోస్ట్ చేసారు.
దీనిపై స్పందించిన ఆప్ నేతలు…. కేజ్రివాల్ పై దుండగులు హత్యాయత్నం చేశారని, స్వల్పగాయాలతో ఆయన తప్పించుకున్నారని సోషల్ మీడియాలో తెలిపారు. ఇనుప రాడ్లు, రాళ్లతో సాయుధులైన వ్యక్తులు ఆయనపై దాడికి దిగి కారును ధ్వంసం చేశారని ఆప్ నేత అశిష్ ట్విట్టర్లో తెలిపారు. దేవుడి దయ వల్ల ఆయన బతికి బయటపడ్డారన్నారు. ముఖ్యమంత్రి బాదల్ కుట్రలో భాగంగానే ఈ దాడి జరిగిందని ఆయన విమర్శించారు. బాదల్ గూండాలు తమ నేతపై దాడిచేస్తుంటే పోలీసులు చూస్తూ ఊరుకున్నారని ఆరోపించారు. దాడికి సంబంధించి ఒక ఫొటోను కూడా ఆయన షేర్ చేశారు.
కాగా వచ్చే ఏడాది జరగనున్న పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అక్కడ పాగా వేసేందుకు ఆప్ వ్యూహాలు రచిస్తోంది. ఇందులో భాగంగానే ఐదు రోజుల పంజాబ్ కేజ్రీవాల్ పర్యటన. ఈ పర్యటన ఈ రోజుతో ముగియనుంది.