తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావును ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అవమానించింది. ఆ రాష్ట్ర నూతన రాజధాని అమరావతి శంకుస్థాపన విశేషాలతో ఢిల్లీలో ఏర్పాటు చేసిన ఛాయాచిత్రాల ప్రదర్శనలో సీఎం కేసీఆర్ ముఖానికి ఏపీ సర్కారు నల్లరంగు వేసింది. శంకుస్థాపన వేదికపై కేసీఆర్ తో పాటు ఉన్నవారి ముఖాలన్నీ స్పష్టంగా కనిపిస్తుండగా.. ఆయన ముఖాన్ని మాత్రమే కనిపించనీయకుండా చేసి పైశాచికత్వాన్ని ప్రదర్శించింది. గత నెల 22న జరిగిన అమరావతి శంకుస్థాపనకు సీఎం కేసీఆర్ హాజరు కావాలంటూ స్వయంగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హైదరాబాద్కు వెళ్లి మరీ ఆహ్వాన పత్రికను అందించడం తెలిసిందే. ఈ ఆహ్వానం మేరకు అమరావతికి వెళ్లిన కేసీఆర్.. ఆ రాష్ట్ర ప్రజలకు అభినందనలు తెలిపారు.
అయితే ఇప్పుడు ఢిల్లీలోని ప్రగతి మైదాన్లో జరుగనున్న ఎగ్జిబిషన్ సందర్భంగా అమరావతి గొప్పదనాన్ని దేశ ప్రజలకు తెలియజేయడం కోసం ప్రత్యేకంగా ఓ షొటో ఎగ్జిబిషన్ తరహాలో ఛాయాచిత్రాల ప్రదర్శనను ఆంధ్రప్రదేశ్ పెవిలియన్లో ఏర్పాటు చేశారు. కానీ శంకుస్థాపనకు హాజరైన కేసీఆర్ ముఖాన్ని మాత్రం గ్రాఫిక్స్లో ఉద్దేశపూర్వకంగా నల్లరంగుతో మాస్క్ వేసి స్పష్టంగా కనబడకుండా చేశారు. నాలుగు చిత్రాల్లోనూ కేసీఆర్ ముఖాన్ని స్పష్టంగా కనబడనీయకుండా మూసేశారు. కేసీఆర్కు పక్కన ఉన్న చంద్రబాబునాయుడు, ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ముఖాలు మాత్రం స్పష్టంగా కనిపిస్తూ ఉండగా, వారి మధ్యలోనే ఉన్న కేసీఆర్ ముఖం మాత్రం నల్లగా గుర్తు పట్టడానికి వీల్లేకుండా చేశారు. దీంతో కేసీఆర్ ముఖాన్ని చూపించడానికి ఆంధ్ర సర్కారుకు ఇష్టం లేకపోతే ఆయనను ఎందుకు ఆహ్వానించారని పలువురు ప్రశ్నిస్తున్నారు. అయితే దీనికి సమాధానం చెప్పడానికి ఆంధ్ర సర్కారు నిర్వాహకులు సిద్ధంగా లేరు. ఓ రాష్ట్ర ముఖ్యమంత్రిని గౌరవప్రదంగా ఇంటికి వెళ్లి ఆహ్వానించిన చంద్రబాబు.. ఢిల్లీలో జరుగుతున్న అంతర్జాతీయ ఎగ్జిబిషన్లో చోటుచేసుకున్న కుట్రకు సమాధానం చెప్పాలన్న డిమాండ్లు వస్తున్నాయి.