కోట్లాది మంది ప్రార్థనలని ఆ దేవుడు వినలేదు… మనకోసం, మన భద్రత కోసం పోరాడే వీరుడు ఇక మనకు లేడు.సియాచిన్ ప్రమాదంలో తీవ్రంగా గాయపడి, మృత్యువుతో పోరాడుతున్న జవాన్ లాన్స్నాయక్ హనుమంతప్ప కను మూశారు. ఆయన ప్రాణాలు కాపాడేందుకు ఢిల్లీలోని ఆర్మీ రీసెర్చ్ అండ్ రిఫరల్ ఆస్పత్రి వైద్యులు తీవ్రంగా ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. గురువారం 12 గంటల ప్రాంతంలో హనుమంతప్ప కనుమూశారు. కర్ణాటకలోని థార్వాడ్కు చెందిన హనుమంతప్పకు భార్య, ఏడాదిన్నర పాప ఉన్నారు. గత మూడు రోజులుగా అతను వెంటిలేటర్పైనే ఉన్నాడు. 11.45 నిమిషాలకు జవాను హనుమంతప్ప తుదిశ్వాస విడిచినట్లు ఆర్మీ స్పష్టం చేసింది. సియాచిన్ కొండపై మృత్యుంజయుడిగా బయటపడ్డ హనుమంతప్ప తిరిగి కోలువాలని గత రెండు రోజులు దేశవ్యాప్తంగా ప్రజలు పూజలు, ప్రార్థనలు చేశారు. ఆయన్ను కాపాడేందుకు ఆర్మీ వైద్యులు శతవిధాలా ప్రయత్నించారు. హనుమంతప్ప శరీరం చికిత్సకు సహకరించలేదు….
ఆరు రోజులుగా మంచులో ఉండటంతో హనుమంతప్ప శరీరంలోని కొన్ని భాగాలకు రక్తం సరఫరా కావడంలేదని, బ్లడ్ప్రెషర్ అత్యంత కనిష్ఠంగా ఉన్నందున హనుమంతప్పను బతికించుకోలేకపోయామని చెప్పారు. శరీర ఉష్ణోగ్రతను పెంచేందుకు చేస్తున్న ప్రయత్నాలు సఫలం కావడంలేదని వెల్లడించారు. ఇంటెన్సివ్ కేర్, న్యూరాలజీ, నెఫ్రాలజీ, ఎండోక్రైనాలజీ విభాగాల నిపుణులతోపాటు సర్జన్లతో కూడిన వైద్య బృందం హనుమంతప్పకు చికిత్స అందించినా ఫలితం లేకపోయింది.దేశ రక్షణ కోసం తపించిన హనుమంతప్ప డ్యూటీలోనే కన్ను మూశారు…. ఆ వీరుడికి సలాం చెప్తోంది అలజడి.కాం.