మాతృ దేవోభవ, పితృ దేవోభవ అని కొనియాడుతూ, తల్లిదండ్రులే ప్రత్యక్ష దైవాలు అంటారు. మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రుల యొక్క బాగోగులను చూసుకోవాల్సిన బాధ్యత వారి పిల్లలుగా ప్రతిఒక్కరి ఉంది. కానీ, మనలో కొందరు మాత్రం తల్లిదండ్రులను పోషించడం బరువుగా భావించి, అనాథశరణాలయాల్లో, వృద్ధాశ్రమాల్లో వారిని చేర్పించి చేతులు దులుపుకుంటున్నారు.
ఇంకొందరు అయితే, ఇంట్లో ఉంచుకొని కూడా తల్లిదండ్రుల్ని హీనంగా చూసేవారు లేకపోలేదు. ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ కూడా తల్లిదండ్రులపట్ల చులకన భావం ప్రదర్శించి, వారిని సరిగ్గా చూసుకోని వారిపై అస్సోం రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంది.
ఏప్రభుత్వ ఉద్యోగి అయినా తమ తల్లిదండ్రులను సరిగ్గా చూసుకోవడం లేదని, వారి నుండి ఫిర్యాదు వస్తే వెంటనే ఆ ప్రభుత్వ ఉద్యోగి నెలజీతంలోంచి కొంత అమౌంట్ కట్ చేసి ఆ మొత్తాన్ని తల్లిదండ్రులకు అందజేస్తామని తెలియజేసారు అస్సోం రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి అయిన హిమాంత బిస్వ శర్మ. తమ రాష్ట్రంలో మొదటిసారి పూర్తి స్థాయి బడ్జెట్ప్రవేశ పెడుతున్న హిమాంత ఈ నిర్ణయం తీసుకున్నాడు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం కూడా ఈ ఆర్థిక సంవత్సరం నుంచే అమలులోకి రానుందని మంత్రి తెలిపారు.హిమాంత బిస్వ శర్మ తీసుకున్న ఈ గొప్ప నిర్ణయంపై అన్ని వర్గాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి నిబంధన ఒక్క అస్సోం రాష్ట్రానికే కాకుండా, దేశవ్యాప్తంగా కేంద్రం అమలు చేయాలని ప్రజలు ఆశిస్తున్నారు.