పెద్ద నోట్ల రద్దుతో ప్రజలు చేతిలో సరిపడా నగదు లేక ఇబ్బందిపడుతున్నారు. నగదు రహిత లావాదేవీలపై దృష్టి పెట్టిన భారత ప్రభుత్వం, ఇకపై రూ.500 మించిన లావాదేవీలను అంతటా నగదు రహితంగా చెల్లించే దిశగా అడుగులు వేస్తుంది. ప్రభుత్వం చెల్లించే లేదా స్వీకరించే లావాదేవీలేవైనా రూ.500 మించితే పూర్తిగా నగదు రహితంగా జరగాలని డిజిటల్ లావాదేవీలపై ఏర్పాటైన టాస్క్ఫోర్స్ తెలంగాణ ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. ప్రస్తుతానికి మొత్తం ఆర్థిక వ్యవస్థలో 80శాతం పైగా లావాదేవీలను నగదు రహితంగానే జరపాలన్న లక్ష్యం ఉపయుక్తకరమని కమిటీ అభిప్రాయపడింది. పెద్దనోట్ల రద్దు తర్వాత నగదు రహిత లావాదేవీలను పెంచేందుకు సూచనలివ్వాలని సీనియర్ ఐఏఎస్ అధికారి సురేశ్చందా సారథ్యంలో ప్రభుత్వం ఓ టాస్క్ఫోర్స్ను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే…
ఈ కమిటీ పలు సూచనలు చేసింది.
ప్రభుత్వ రంగంలో…
- తొలుత పెద్దమొత్తంలోని లావాదేవీలను డిజిటల్ చెల్లింపు సదుపాయాల ద్వారా నగదురహితం చేయాలి.
- ప్రభుత్వ శాఖల లావాదేవీలను 80శాతంపైగా నగదురహితం చేయాలి.
- రూ.500 దాటినా ఏచెల్లింపైనా స్వీకరణైనా నగదురహితంగానే చేయాలి.
- పీఓఎస్/నెఫ్ట్/ఆర్టీజీఎస్/నెట్బ్యాంకింగ్/ఐఎంపీఎస్/యూపీఐ/ఈవాలెట్ ద్వారా చెల్లించే సౌకర్యాన్ని ప్రజలకు వీలైనంత త్వరగా కల్పించాలి.
- రూ.5వేల కంటే తక్కువకు క్రెడిట్/డెబిట్ కార్డుల ద్వారా జరిపే కార్యకలాపాలపై లావాదేవీల రుసుంను ప్రభుత్వ శాఖలే భరించాలి.
ప్రైవేటులో..
- 60 శాతంపైగా లావాదేవీలను నగదు రహితం చేయాలి.
- చిన్నమొత్తం లావాదేవీలకు నగదు రూపంలో అనుమతిచ్చి, పెద్దమొత్తం లావాదేవీలను నగదురహితంగా మార్చాలి.
- రూ.వెయ్యికి మించి వ్యాపార సంస్థల మధ్య జరిగే, రూ.ఐదు వేలకు మించి వినియోగదారుడికి- వ్యాపార సంస్థకు జరిగే ప్రతి లావాదేవీ నగదురహితంగా ఉండాలి.
- పీఓఎస్/నెఫ్ట్/ఆర్టీజీఎస్/నెట్బ్యాకింగ్/ఐఎంపీఎస్/యూపీఐ/ఈవాలెట్ చెల్లింపులు జరిపేలా సౌకర్యాలు అందుబాటులో ఉంచాలి
- గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి కుటుంబంలో ఒకరికైనా రూపే డెబిట్ కార్డు ఉండేలా చూడాలి.
- చౌకధరల దుకాణాల్లో ప్రజలు పీఓఎస్/ఈవాలెట్ల ద్వారా చెల్లించేందుకు అవకాశం కల్పించాలి.
- వ్యాట్ డీలర్లంతా ప్రజలు పీఓఎస్/ఐఎంపీఎస్/యూపీఐ/ఈవాలెట్ పద్ధతిలో చెల్లించేందుకు అవకాశం కల్పించాలి.
- మార్కెట్ యార్డుల్లో నగదురహిత పద్ధతిలోనే చెల్లింపులు జరపాలి.
- ఆస్పత్రులు/రవాణా వ్యవస్థలు/విద్యాసంస్థలు/వ్యాపారులు కూడా నగదురహిత చెల్లింపులకు అవకాశాన్ని కల్పించాలి.
(Visited 1,168 times, 1 visits today)