మీకు ఐశ్వర్యా రాయ్ తెలుసా..? మరి సానియా మీర్జా..? పోనీ సునితా విలియంస్…!? ఏంటలా చూస్తున్నారు వెటకారంలా అనిపిస్తోందా ఇంత సెలెబ్రిటీ మహిళలు తెలియని వాళ్ళెవరైనా భారత దేశంలోఉంటారా..!? అనుకుంటున్నారా..? ఐతే ఇప్పుడు చెప్పండి మీకు “జస్టిస్ అన్నా చాందీ” తెలుసా పోనీ ఆవిడ మన దేశ మొదటి మహిళా న్యాయ మూర్తి అని అయినా తెలుసా..? మరీ పాతవిడ అంటార సరే మరి “ప్రేం మాథుర్“..! మనదేశపు మొదటి మహిళా పైలట్ కేవలం జెనరల్ నాలెడ్జ్ పుస్తకాల్లోనే కాదు కాస్త మనకూ గుర్తుండాలని చేసే చిన్న ప్రయత్నమే……
1.కెప్టెన్ ప్రేం మాథుర్ భారత దేశ మొట్టమొదటి మహిళా పైలెట్.
స్త్రీ పై ఎన్నొ ఆంక్షలు ఉండే కాలం ఇప్పటికీ నడుస్తోంది. కానీ ప్రేం మాథుర్ 1947 లోనే అలహాబాద్ ఫ్లయింగ్ క్లబ్ నుండి తన “కమర్షియల్ పైలట్ లైసెన్స్” పొందారు. ఒక మహిళ మామూలుగా బయటకు రావటం మీదే ఎన్నో ఆంక్షలు ఉన్న రోజులవి, ఇక ఏకంగా మహిళ పైలట్ గా విమానాలు నడపటమా అంటూ ఆమెను తిరస్కరించినా చివరకు ఆమె మొండి పట్టుదల తో హైదరాబాద్ డెక్కన్ ఏయిర్ వేస్ అధికారులని మెప్పించగలిగింది అంతే కాదు ఫ్లయింగ్ కలర్స్ ఇంటర్వ్యూ లో కూడా విజయం సాధించింది. ఎంతో మందితో వ్యతిరేకత ఎదురయినా ఎవరికీ జడవని మాథుర్ ప్రైవేట్ ఏయిర్లన్స్ లో తన సేవలని కొనసాగించి కొన్ని సంవత్సరాల ముందే ఆమె ఇండియన్ ఏయిర్ లైన్స్ లోనూ చేసారు…
2. అన్నా చాందీ దేశంలోనే మొదటి మహిళా న్యాయమూర్తి.
1905 లో ట్రివేండ్రం లో జన్మించిన అన్నా చాందీ ఆరోజుల్లో రాష్ట్రం లోనే మొదటి సారిగా లా పట్టా పొందిన మహిళ గా వార్తల్లోకెక్కారు.. బారిస్టరు గా తన ప్రాక్టీస్ కొనసాగిస్తూనే మహిళా హక్కుల కోసం పోరాటం చేసారు అంతే కాదు మహిళల కోసం శ్రీమతి అనే పత్రికని నడుపుతూ దానికి ఎడిటర్ గా కూడా చేసారు.1959 లో ఆమె కేరళ హైకోర్ట్ కి జడ్జ్ గా నియమించబడటం ఒక సంచలనమయ్యింది…
3.విజయ లక్ష్మీ పండిట్, ఐక్యరాజ్య సమితి జెనెరల్ అసెంబ్లీ అధ్యక్షురాలు.
భారత మొదటి ప్రధాని పండిట్ జవహర్ లాల్ నెహ్రూకి సోదరి అయిన విజయ లక్ష్మీ పండిట్ 1900 లొ జన్మించారు. భారత దౌత్యవేత్త గానూ, రాజకీయాలలోనూ మెలగటం ఆమె పట్ల అటెన్షన్ ని మరింత పెంచాయి. 1953 లో ఐక్యరాజ్య సమితి జెనెరల్ అసెంబ్లీ కి అధ్యక్షురాలిగా నియమించ బడ్డారు.క్యాబినెట్ పోస్ట్ ని అందుకున్న మొదటి మహిళ గా విజయ లక్ష్మి గుర్తించ బడ్డారు..
4. కిట్టూర్ రాణీ చెన్నమ్మ:మొదటి తరం మహిళా స్వతంత్ర సమర యోధురాలు.
1824 లోనే కిట్టూర్ చెన్నమ్మ కౄరమైన చట్టాలకు వ్యతిరేకంగా ఈస్ట్ ఇండియాకంపెనీ పై తిరుగు బాటు చేసి సాయుద పోరాటం లో పాల్గొన్నారు. మన దేశం కోసం బలైపోయిన ఎందరో ఇలాంటి యోధులు సరైన గుర్తింపు లేక ఙ్ఞాపకాలు గానే ఉండిపోయారు.అప్పటి పాలకులపై జరిగిన తిరుగు బాటు పోరాటం లో శ్రీ చెన్నమ్మ చూపిన ధైర్య సాహసాలు ఇప్పటికీ కర్ణాటకలో జానపద కథలు గా చెప్పుకుంటారు..
5.బేగం హజ్రత్ మహల్: భారతీయ పోరాట చరిత్రలో కీలక ముద్ర.
1820 లో జన్మించిన బేగం హజ్రత్ మహల్.అవద్ రాజ్య పాలకుడు గా ఉన్న భర్తతో కలిసి ఎన్నొ వ్యవహారాలను సమర్థంగా నిర్వహించింది.1857 లో జరిగిన సైనిక తిరుగుబాటు సమయంలో స్వతంత్ర్యోధ్యమం లో కీలక వ్యక్తి గా మారారు.కానీ బ్రిటీషువారు మళ్ళీ లక్నోని స్వాధీనం చేసుకొవటం తో ఆమె భర్త ప్రవాసంలో ఉన్నప్పుడు కూడా ఆమె పాలనాభాధ్యతలను తన భుజాలపై వేసుకున్నారు.రహదారుల నిర్మాణం పేరుతో బ్రిటీష్ పాలకులు భారతీయుల గుడులనీ మసీదులనీ కూలదోయటమే కాక తమ దేశంలో వారు చేసే అకృత్యాలను ఎదిరించి ప్రపంచానికి చెప్పింది కూడా..
6.ఝాన్సీ రాణీ:తిరుగుబాటుకి చిహ్నం.
1828 లో జన్మించిన ఝాన్సీ లక్ష్మీ భాయ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిందేం లేదు. ధైర్యానికి ఇప్పటికే లక్ష్మీ భాయ్ పేరే ఒక చిరునామా .
బ్రిటీష్ పాలనకి వ్యతిరేకంగా పోరాడిన యోధురాలైన లక్ష్మీ భాయి ఇప్పటికీ దేశ ప్రజలకీ ముఖ్యంగా మహిళలకీ స్పూర్తిగా ఇలుస్తోంది. 1858 లో జరిగిన సరాయ్ కోటా యుద్దం లో ఆమె పోరాడుతూ మరణించారు…
7.సావిత్రీ భాయ్ పూలే:మహిళల చదువు కోసం శ్రమించిన మొదటి మహిళా ఉపాధ్యాయురాలు.
మొట్ట మొదటి సారిగా ఆడ పిల్లల చదువు కోసం సమాజం తోనే పోరాటం చేసిన మహిళ సావిత్రీ భాయి పూలే. ఆడ పిల్లలకు చదువు చెబుతున్నందుకు ఆమె వీథిలో నడుస్తున్నపూడు రాళ్ళతో కొట్టడం, పేడ విసరటం, దారుణమైన భాషలో తిట్టటం వంటివి చేసే వారు జనం. అయినా అన్నింటినీ భరించి ఆడ పిల్లల చదువును కొనసాగించారామె. అంటరాని వారుగా పిలవబడే మనుషులనీ ఆమె తన చుట్టూ చేర్చుకున్నారు, మహిళా సాధికారికత కోసం ఎంతో శ్రమించిన వ్యక్తి గా సావిత్రీ భాయి చరిత్రలో నిలిచిపోయారు
8. ఆనందీ గోపాల్ జోషీ: మొదటి భారతీయ మహిళా అలోపతిక్ డాక్టర్.
9 ఏళ్ళ వయసులోనే అప్పటి భారతీయ ఆచారాల ప్రకారం ఆనందీ కి పెళ్ళి జరిగిపోయింది. అక్కడితోనే ఆమె ఆశయాలు ఆగిపోవలసినవి కానీ ఆమె భర్త చదువుకోవటానికి ప్రోత్సహించారు.1800 చివరల్లో మిగిలిన కుటుంబ సభ్యులనీ ఒప్పించిన ఆమె భర్త సహకారం తోనే అమెరికా విమానం ఎక్కారు. చివరకు తన చిరకాల స్వప్నం ఐన మెడిసిన్ పూర్తి చేసి మొదటి భారతీయ డాక్టర్ గా నిలిచారు. ఆ ఆశయాన్ని సాధించటానికి తాను తన భర్త పడిన కష్టాలను, భారతీయ మహిళా డాక్టర్ల పై ఉండే ఒత్తిళ్ళ పైనా ఆమె తీవ్రంగా చర్చించే వారు.
9. సునితా క్రిష్ణన్;వుమెన్ ట్రాఫికింగ్ పై ప్రాణాలకు తెగించి పోరాడుతున్న మహిళ.
ఇప్పటివరకూ చరిత్రలో నిలిచిన మహిళలనే చెప్పుకున్నాం. మన కాలం లో మన పక్కనే ఉండే మరో మహిళ సునితా కృష్ణన్. ప్రజ్వల,అనే సంస్థని రన్ చేస్తున్నారు ఈ సంస్థ ఏం చేస్థుందంటే. బలవంతంగా వ్యభిచారం లోకి దింపబడిన మహిళలని మళ్ళీ మామూలుగా జీవించే పరిస్థితుల్లోకి తీసుకు వస్తుంది. వారి జీవితాలను మరింత మెరుగు పరుచుకునే విధంగా వారికి శిక్షణ ఇస్తుంది. 15 సంవత్సరాల వయసు లోనే సామూహిక అత్యాచారానికి గురయిన సునితా.ఆమె కేవలం ఇప్పుడు భారత్ లోనే కాదు అమెరికా లాంటి దేశాలలోనూ పనిచేస్తోంది..
వీళ్ళు మాత్రమే కాదు…ఇంకా చాలా మందే ఉన్నారు ఎందుకని చరిత్ర వీళ్లని పక్కన పెడుతోందీ అన్నదే అర్థం కాదు. అలా అని ఎవర్నీ తక్కువ చేసేదీ లేదూ… పని గట్టుకొని మరొకర్ని ప్రచారం చేసేదీ లేదు… మనం మరచి పోకూడని కొందరిని మరోసారి గుర్తు చేసుకోవటానికే ఈ చిన్న ప్రయత్నం…