ఏ తల్లి అయినా తన చంటి బాబునో, పాపనో తన పక్కనే పడుకోపెట్టుకుని జోల పాడుతూ, జో కొడుతూ నిద్ర పుచ్చుతుంది. తన పిల్లలు హాయిగా ఆదమరిచి నిద్రపోతున్నపుడే తనకు నిద్ర పడుతుంది. అయితే ఇలా అమ్మ పక్కనే పడుకోవడం వల్ల పిల్లలు తృప్తిగా నిద్ర పోరు అంటున్నారు అమెరికా శాస్త్రవేత్తలు. తమ పిల్లల్ని జో కొడుతూ, జోల పాడుతూ పడుకోపెట్టడమే అందరికీ అలవాటు. కానీ ఇలా పొద్దస్తమానం అమ్మ పక్కన పడుకునే 4 నెలలు, ఆపై వయసుగల శిశువులకు నిద్ర తగ్గడమే కాకుండా.. వారి నిద్రించే అలవాట్లలో కూడా లోపాలు ఉంటున్నట్లు పెన్సిల్వేనియా కాలేజ్ ఆఫ్ మెడిసిన్ శాస్త్రవేత్తలు గుర్తించారు.
నిజానికి ఏడాది నిండేదాకా పూర్తిగా తల్లులు, పిల్లల్నితమతోపాటే పడుకోబెట్టుకోవాలని, అప్పుడే బిడ్డకు సంరక్షణ అనీ.. ఆకస్మిక శిశు మరణ ముప్పు కూడా వాటిల్లదని అమెరికన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ (AAP) సూచించింది. పెన్సిల్వేనియా కాలేజ్ ఆఫ్ మెడిసిన్ శాస్త్రవేత్తలు తెలిపే విషయాలు AAP సూచనలకు విరుద్ధంగా ఉండడం గమనార్హం. అయితే, నాలుగు నెలల వయసు వచ్చేసరికే పిల్లలకు తమంతట తాముగా నిద్రపోవడం అలవాటవుతుందట. ఆ తర్వాత కూడా తల్లులు తమతో పాటే పిల్లలను పడుకోబెట్టుకోవడం వల్ల వారి నిద్రకు భంగం వాటిల్లుతోందని పరిశోధకుడు డా.ఇయాన్ పాల్ తెలిపారు.
4 నెలల నుంచి 30 నెలల (రెండున్నర ఏళ్లు) వయసున్న 279 మంది చిన్నారుల నిద్ర తీరును పరిశీలించిన తర్వాతే ఈ విషయాలు చెబుతున్నాం అంటున్నారు డా. ఇయాన్ పరిశోదక బృందం. తల్లుల పక్కనే పడుకునే పిల్లలు, మిగతా వారితో పోలిస్తే దాదాపు రోజూ 45 నిమిషాలు తక్కువగా నిద్రపోతున్నారని కూడా వారి పరిశోధనలో తేలిందట. అయితే, వీరి ఫల్తాలు, ఏఏపీ నిర్దేశకాలు పరస్పరం విరుద్దంగా ఉండడం తో ఈ పరిశోధనలపై మరింత నిశితంగా చర్చించాల్సి ఉందని వైద్యులు, పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు.